Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kathasameekshalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సామాన్యుడి అసహనం - అనంత

 

సింగపూర్ పాఠం - 7

సింగపూర్ లోని హార్బర్ కి దగ్గర్లో షెల్డన్. జి. అడెలోసన్ సాండ్స్ కేసినో - దానికి అనుబంధంగా వరల్డ్ క్లాస్ హై ఎండ్ షాపింగ్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్, ప్రపంచం లోని అన్నిరకాల ఆహారపదార్థాలు అందించగలిగే ఫుడ్ కోర్ట్స్, కన్వెన్షన్ సెంటర్ ఒకే కాంప్లెక్స్ గా నిర్మిస్తానని అడిగినప్పుడు సింగపూర్ ప్రభుత్వం కాలయాపన్ చేయలేదు. చాలా వేగంగా, చురుగ్గా ఆలోచించింది.

దేశంలోకి అమెరికన్ డాలర్ల పెట్టుబడి మిలియన్స్ లో వస్తుంది, ఆపైన ఆ దేశాల నుంచి వచ్చే టూరిస్ట్ లు, వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ కొన్నా, సాండ్స్ స్టర్ హోటల్ లో బస చేసినా, ఫుడ్ కోర్ట్ కు వెళ్ళినా, కన్ వెన్షన్ సెంటర్ లో సెమినార్స్, బిజినెస్ మీటింగ్స్ పెట్టుకున్నా, స్పా కెళ్ళి మసాజ్ చేయించుకొన్నా-ఆ పైన సరదాగా కేసినో కి వెళ్ళి జూదం ఆడినా...ఇలా  ప్రతి స్టెప్ లో సింగపూర్ లోనే టాక్స్ రూపంలో ఆదాయం వస్తుందని సింగపూర్ మంత్రి వర్గం ఆలోచించింది.

అయితే ఇక్కడ రెండు రకాల సమస్యలున్నాయని మంత్రివర్గం దృష్టికి వచ్చింది.

ఒకటి : ప్రజల ముంగిట్లోకి ప్రభుత్వం జూదశాలను తెచ్చిందని దేశప్రజలు విమర్శిస్తే ఏమిటి సమాధానం....

దీనికి పరిష్కారం వెంటనే కనుగొన్నారు-సింగపూర్ దేశప్రజలు కేసినో కి వెళ్ళకుండా నిరోధించేందుకు ఎంట్రీ ఫీజు 100డాలర్లు ఫిక్స్ చేసారు. షుమారు ఐదువేల రూపాయలు. విదేశస్తులయితే పాస్ పోర్ట్ చూపించాక పంపిస్తారు. వీళ్ళకు ఎంట్రీ ఫీజు లేదు.

ఈ విధంగా మొదటి సమస్యకి పరిష్కారం కనుగొన్నారు.

ఇండియాలో లాగా సింగపూర్ ప్రభుత్వానికి చాదస్తం లేదు. నాటకాలు ఆడదు.

దేశప్రజలకు మేలు చేయటానికే తమ పార్టీ పుట్టినట్లు, అందుకే అధికారంలోకి వచ్చినట్లు మనదేశంలో రాజకీయ పార్టీల్లా దిగజారి ప్రవర్తించరు.

సింగపూర్ పౌరుడు 100 సింగపూర్ డాలర్స్ కేసినో ఎంట్రీకే కట్టగలిగితే- అతను సంపాదనాపరుడు క్రిందే లెక్క.

జూదంలో పోగొట్టుకొన్నా లెక్కచేయని వాళ్ళే కేసినోవాకి వెళ్తారు.

ఏ ప్రభుత్వమైనా ఒక పౌరుడికి కుటుంబ బాధ్యతలు నేర్పగలదా..? ఆ పౌరుడు తనకై తానే పాటించవలసిన బాధ్యతను మరొకరు నేర్పుటమేమిటి?

టూరిస్ట్ లు రాకపోతే ఆ దేశానికి ఆదాయం ఎలా వస్తుంది?

విదేశస్థులు అక్కడ ఏ వినోదం పొందుతారు?

అని సింగపూర్ ప్రజలకి నచ్చజెప్పి, ఆ వెంటనే కళ్ళముందున్న మరో సమస్యపై దృష్టిపెట్టారు.

అది స్థలం సమస్య...

అసలే చిన్నదేశం....

చుట్టూ సముద్రం...

ఈ సమస్యకీ వెంటనే పరిష్కారం కనుగొన్నారు.

మా దేశంలో స్థలం లేదు గనుక సముద్రాన్ని పూడ్చుకొని దానిపై శాండ్స్ కట్టుకోమని షెల్డన్. జి. అడెల్ సన్ కి వర్తమానం పంపించారు.
ఆ మరుక్షణమే షెల్డన్ సింగపూర్ లో వాలిపోయి ఇండోనేషియా, మలేషియా దేశాలకి రాయల్టీ పే చేసి మట్టిని తెచ్చి సముద్రాన్ని పూడ్చి ఆ స్థలంలో బిలియన్స్ ఖర్చుపెట్టి లాస్ వెగాస్ కేసినోస్ ని తలదన్నేలా మెరీనా బే సాండ్స్ నిర్మించుకొన్నారు.

అది ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వానికి నిత్యం కాసుల వర్షం కురిపిస్తోంది...

మరిన్ని శీర్షికలు
vrukshamulu - jeeva samrakshakulu