ఏదో సినిమా చేసేశాం అన్నట్టుగా సినిమాలు చేయడం రజనీకాంత్ అల్లుడు ధనుష్కి ఇష్టం ఉండదు. ఏ సినిమా చేసినా సరే అందులో 'కంటెంట్'కి ఈ యంగ్ హీరో ప్రాధాన్యతనిస్తాడు. తాను కోరుకుంటే కమర్షియల్ సినిమాలు చేసేసి, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు కూడా సూపర్ స్టారే అనిపించుకోవచ్చు. కానీ ధనుష్ అలా ఆలోచించనే ఆలోచించడు. తక్కువ బడ్జెట్ అయినా ఎక్కువ బడ్జెట్ అయినా మంచి కథలే ముఖ్యమంటాడాయన. అలా ఆలోచిస్తాడు కాబట్టే 'రఘువరన్ బిటెక్' లాంటి సినిమాలు ఆయన్నుంచి వస్తాయి. ఆ 'రఘువరన్ బిటెక్' సినిమాకి సీక్వెల్ 'విఐపి-2' రూపొందుతోంది. సీక్వెల్ని అత్యద్భుతంగా రూపొందించనున్నారు.
ఈ సినిమాకి సౌందర్య రజనీకాంత్ దర్శకురాలు. కథను అందించింది మాత్రం ధనుష్ కావడం విశేషమని చెప్పాలి. తొలి సినిమాలో సరదా సరదాగా తిరిగే ఓ కుర్రాడు, ఇంజనీరింగ్ చేసి ఓ కంపెనీలో పనిచేసి ధనవంతుడైన ఓ బిల్డర్ని మట్టికరిపిస్తాడు. ఈ క్రమంలో అతను నిరుద్యోగులైన ఇంజనీర్లందరికీ ఉపాధి కల్పించడం నావెల్ పాయింట్. సీక్వెల్లో ఇంకా కీలకమైన అంశంతో ప్రేక్షకుల్ని కట్టిపడేయనున్నారట. అదేంటో తెరపై చూస్తేనే బాగుంటుంది. 'రఘువరన్ బిటెక్'లో అమలాపాల్, సురభి హీరోయిన్లుగా నటించారు. సీక్వెల్లోనూ అమలాపాల్ ఉంటుందట. మరో హీరోయిన్ కోసం పలువురు పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారంటూ గుసగుసలు వినవస్తున్నాయ్.
|