Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
horoscope from 18-11-2016 to 24-1-2016

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahitee vanam
పాండురంగమాహాత్మ్యం
 
అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు అడిగిన ప్రశ్నకు అందుకు సమాధానము యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడుకుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును చెప్పనారంభించాడు. ఆ సందర్భంగా పుండరీకుడి గుణ శీలాదులను వర్ణిస్తూ, ఆతడి పూజావిధానాన్ని వర్ణిస్తున్నాడు పరమశివుడు.

నిడుద చిగురరఁటియాకున
నిడి వివిధాన్నములు భూసురేశ్వరుఁ డొసఁగున్
బడి ఘంట మొరయఁజేయుచు
జడనిధితల్పునకుఁ బూర్ణసంకల్పునకున్                  (కం)
 
వివరముగా, విధివిధానముగా అర్చన చేసి, పొడవైన లేత అరటియాకులో వివిధములైన అన్నములను, వరుసగా, ఘంటను మ్రోగిస్తూ ఆ జలనిధిలో పవ్వళించే స్వామికి, పూర్ణ సంకల్పుడైన స్వామికి నివేదన చేస్తాడు ఆ భూసురుడు, పుండరీకుడు. పూర్ణ సంకల్పుడు 
అని విచిత్రంగా సంబోధించాడు స్వామిని, తెనాలి రామకృష్ణుడు. ఆయనది వికల్పము లేని సంకల్పము. నెరవేరే సంకల్పము. సమస్త సృష్టీ ఆయన సంకల్పమే కనుక, ఆయన పూర్ణసంకల్పుడు! ఆయన ఆ సముద్రపు మంటపం మీద, పాము పక్కపై పడుకుని, యోగనిద్రలో చేసే సంకల్పాలే ఈ సృష్టి, స్థితి, విలయాలు అన్నది జగజ్జనని గోదాదేవి, 'సుందర శేషశాయి పరిశుద్ధుడు పాల సముద్రమందునన్ విందుగ యోగనిద్రగొను విష్ణుడు ''ఖేలగా జగములను, పుట్టించి, పాలించి పోషించి కూలజేసే ఘనుడు' అన్నది. ఆ యోగనిద్రను, ఆ పూర్ణకల్పాన్ని యిక్కడ చెబుతున్నాడు తెనాలి రామకృష్ణుడు.

భూమిసురసూతి సాల
గ్రామశిలావారి, గంబుగర్భస్థము, ది
వ్యామోద శ్రీతులసీ 
కోమలదళ సురభితంబు గురునకు నొసఁగున్       (కం) 
 
ఆ బ్రాహ్మణకుమారుడు, పుండరీకుడు శ్రీహరి సాలగ్రామశిలను అభిషేకించిన జలాన్ని, దివ్యామోదమైన, లేత శ్రీతులసీదళముల సౌరభము నిండిన జలాన్ని,శంఖములో పోసి, దానిని తన గురునకు, అంటే తండ్రికి తీర్ధముగా యిస్తాడు. గురువులు ఐదుగురు అని రహస్యం. జన్మనిచ్చిన తండ్రి, విద్యనేర్పిన గురువు, పిల్లనిచ్చిన మామ, అన్నమును పెట్టిన దాత, ప్రాణమును కాపాడినవాడు ఈ ఐదుగురూ గురువులు అని భారతీయ సంప్రదాయము, కనుక తండ్రిని గురుడు అంటున్నాడు రామకృష్ణుడు.

తిరువారాధనమిట్లొనర్చి ధరణీదేవాన్వయ శ్రేష్ఠుఁడా 
హరికర్పించుటఁ బావనంబులగు శాల్యన్నంబులున్ నేతులున్ 
వరుగుల్ చారులు పప్పులప్పడములున్ దాలింపులున్ బూపముల్ 
పరమాన్నంబులుఁబెట్టు నెట్టన భుజింపన్ దల్లికిన్ తండ్రికిన్             (మ)

ఈవిధంగా తిరువారాధన చేసి, పావనములైన శాల్యన్నాలు, నేతులు, వరుగులు, చారులు, పప్పులు, అప్పడాలు, పోపుచేసిన కూరలు, పిండివంటలు, పరమాన్నాలు సమృద్ధిగా తన తల్లిదండ్రులకు పెడతాడు బ్రాహ్మణవంశ శ్రేష్ఠుడు, పుండరీకుడు. యిలా అతివృద్ధులు,
మందబుద్దులు ఐన తల్లిదండ్రులను ప్రేమగా చూస్తూ, వారి అడుగులకు మడుగులొత్తుతూ, అడిగితే పులి జున్నైనా సరే తెచ్చి యిస్తూ(!) ఎప్పటికప్పుడు కొత్తగా మచ్చికతో, అంటే కొంతకాలానికి విసుగొచ్చి కాఠిన్యము రాకుండా, వారితో కాలోచితమైన నోములు నోమిస్తూ,
ఆ బ్రాహ్మణకుమారుడు పుండరీకుడు సమస్త ప్రపంచముచేత అభినందింపబడుతున్నాడు.

పరలోకావాస సుఖా
దరపరతన్ జనిన తల్లిదండ్రులకొసఁగెన్
గురుభక్తి నిగుడు కొడుకతి 
కరుణామతి గంగ నస్థి, గయఁ బిండంబున్     (కం)

కొంతకాలానికి పరలోకనివాస సుఖం మీది ప్రేమతో తల్లిదండ్రులు తనువులను చాలించి, వెళ్ళిపోయారు. యిక్కడ కూడా ఒక మెరుపు, ఒక విరుపు! మృత్యు భీతితో, దిగులుతో, కొడుకుమీది మమకారంతో కాదు, పరలోకనివాససుఖంమీది ఆదరంతో శరీరాలను యిష్టపూర్తిగా 
వదిలిపెట్టిన పుణ్యాత్ములు ఆయన తల్లిదండ్రులు! పరలోకనివాసము, పరలోకప్రయాణము అంటే ఆదరం, అంటే ప్రకృతి ధర్మం మీద అవగాహనా, సృష్టి నియమంపట్ల గౌరవము ఉన్న యోగులు ఆయన తల్లిదండ్రులు! తల్లిదండ్రులమీద భక్తితో, కరుణతో వారి అస్థికలను 
గంగలో కలిపాడు, గయలో పిండ శ్రాద్ధము పెట్టాడు పుండరీకుడు.

ప్రేయసివలనఁ బ్రబోధ వి
ధేయమతుల సుతులఁగాంచి తీర్చెఁ బితౄణం
బాయయ్య తదీయంబగు
ప్రాయపు బ్రొద్దంతఁ గొంత పడమరఁదిరిగెన్        (కం)

ప్రేయసివలన విద్యావినయవంతులైన కుమారులను కని, పితృదేవతల ఋణం తీర్చుకున్నాడు, వంశాన్ని నిలిపి. భార్య అనకుండా ప్రేయసి అంటున్నాడు యిక్కడ, చిలిపిగా. ప్రియురాలిగా, ప్రియంగా సంభావించిన భార్య అన్నమాట, ఆమె ఎంత అదృష్టవంతురాలు! కొంతకాలానికి ఆ పుండరీకుడి వయసు కొద్దిగా పడమరకు తిరిగింది.వయసు ఉడిగింది.

భాషావిభునిభుఁడమ్ముని
ఈషణదూషణమొనర్చి, యిలుమఱచి, మదిన్ 
శేషఫణిశయనుఁ గనునభి 
లాషోన్నతిఁ జేయుఁ దపమిలాధరతనయా!         (కం)

వయసు సడలినంతనే యిక ఈషణా త్రయాన్ని, ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే మూడిటిని, ధనవ్యామోహం, భార్యా వ్యామోహం, సంతాన వ్యామోహం అనే మూడిటినీ తిరస్కరించాడు బ్రహ్మదేవునితో సమానుడైన ఆ ముని, పుండరీకుడు. ఇల్లు అనేదాన్ని 
మరిచిపోయాడు, విడిచిపెట్టాడు. శేషశయనుడి సాక్షాత్కారంకోసం తపస్సు చేయడం మొదలెట్టాడు నగరాజకుమారీ, పార్వతీ! అని పుండరీకుడి చరిత్రమును పరమశివుడు పార్వతీదేవికి వినిపిస్తున్నాడు.

(కొనసాగింపు వచ్చేవారం)
మరిన్ని శీర్షికలు
navvinchandi navvinchandi