తెలుగు నేల నుంచి తన సామ్రాజ్యాన్ని విస్తరించిన రాజు గౌతమీ పుత్ర శాతకర్ణి. అటువంటి గొప్ప రాజు చరిత్రను తెలుగు ప్రజలందరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరైన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ పాత్రను పోషించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఆ ప్రయత్నం ఇప్పుడు ఆయన ప్రియ తనయుడు నందమూరి బాలకృష్ణ చేయబోతున్నారు. అందులోనూ బాలయ్యకు 100వ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కడం మరీ గొప్ప విషయం. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి.
సినిమా సక్సెస్ కావాలని బాలకృష్ణ, చిత్ర బృందంతో కలిసి మహా రుద్ర యాగం నిర్వహించారు. సినిమా అంటేనే యాగం లాంటిది. చారిత్రక కథ నేపథ్యంలో తీస్తున్న సినిమా అంటే మహా యాగమే. ఈ సినిమాలో ముద్దుగుమ్మ శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. ఈ పాత్రకు బాలకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరు అని ఎంచుకోవడం జరిగింది. అందుకు తగ్గట్లుగానే ఆయన చెప్పిన డైలాగులు, పతాక సన్నివేశాల్లో ఆయన పర్ఫామెన్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. గ్రాఫిక్స్ సన్నివేశాలను కూడా ఎంతో నేచురల్గా చిత్రీకరించామన్నారాయన. ఈ చారిత్రాత్మక కథకు తల్లి పాత్ర ఎంతో కీలకం. అటువంటి కీలక పాత్రలో అలనాటి బాలీవుడ్ అందాల తార హేమామాలినిని ఎంచుకున్నారు. బాలయ్య, హేమామాలినిల మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు హైలైట్ అన్నారు క్రిష్. ఇంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులతో సహా, ఒక ప్రేక్షకుడిగా తాను కూడా ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నానని బాలకృష్ణ అన్నారు.
|