సినీ రంగానికిచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కళా తపస్వి కె. విశ్వనాధ్కి వరించింది. ఈ అవార్డు ఆయనికి దక్కినందుకు యావత్ సినీ ప్రపంచం గర్వంగా ఫీలవుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్కి వేల్యూ బాగా ఉన్న రోజుల్లో కూడా హీరోలు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకొచ్చేవారంటేనే ఆయన గొప్పతనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. హీరోయిజాన్ని పక్కన పెట్టి కళాత్మక ధోరణిలో తమని తాము మలచుకునేందుకు హీరోలు విశ్వనాధ్తో సినిమాలు చేయాలని తపన పడేవారు. అలాగే తమలోని కళాత్మకత బయటికి వచ్చేది. చిరంజీవి, బాలకృష్ణ, కమల్హాసన్ తదితర కథానాయకుల్లో దాగి ఉన్న డిఫరెంట్ టాలెంట్ ఆ రకంగానే బయటికి వచ్చింది.
ఆయన దర్శకత్వంలో వచ్చిన 'శంకరాభరణం' సినిమాని ఏ జనరేషన్ వాళ్లైనా మర్చిపోలేరు. అందుకే అది అప్పటికీ, ఇప్పటికీ ఓ ఆణిముత్యంలా గుర్తుండిపోయింది. అలాంటి ఆణిముత్యాలెన్నో ఆయన దర్శకత్వంలో వచ్చినవి. ఇంత ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆయన్ని వరించినందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తదితర సినీ ప్రముఖులు ఆయన్ని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని అవార్డులు కొందరిని వరిస్తే ఆ అవార్డులకున్న గౌరవం మరింత పెరుగుతుంది. అలాంటి కొద్దిమందిలో విశ్వనాధ్ ఒకరు.
|