సంక్రాంతి తర్వాత తెలుగు సినిమాకి అతి పెద్ద పండగ విజయదశమి. పెద్ద సినిమాలు సంక్రాంతి కోసం ఎలాగైతే పోటీ పడతాయో, విజయదశమికి కూడా అలాగే పోటీ పడతాయి. సంక్రాంతికి 'ఖైదీ నెంబర్ 150', 'గౌతమి పుత్ర శాతకర్ణి' వంటి పెద్ద సినిమాలతోపాటు 'శతమానంభవతి' అనే చిన్న సినిమా కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడం చూశాం. ఆ మూడు సినిమాలూ ఘనవిజయాల్ని చవిచూశాయి. సంక్రాంతి అలా సినీ అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చింది. విజయదశమి కూడా అంతకు మించిన కిక్ ఇచ్చేలా ఉంది. ఎందుకంటే ఈ విజయదశమికి మూడు ప్రతిష్టాత్మక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పైసా వసూల్' సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంకో వైపున సెప్టెంబర్లోనే ఎన్టీయార్ హీరోగా కళ్యాణ్రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'జై లవ కుశ' సినిమా రిలీజ్ కాబోతోంది. బాబాయ్, అబ్బాయ్ కొంచెం గ్యాప్తో ఒకేసారి థియేటర్లలోకి వస్తోంటే, నందమూరి అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. ఈ పోటీలో మహేష్ బాబు 'స్పైడర్' సినిమాతోనూ ఎంటర్ కానుండడం విజయదశమి పోరుని ఇంకా రసవత్తరంగా మార్చిందనడం నిస్సందేహం. అయితే 'స్పైడర్' విడుదలపై ఇంకా కొంత సందిగ్ధత కొనసాగుతోంది. ఏదేమైనా సంక్రాంతికి 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాతో హిట్ కొట్టిన బాలయ్య, విజయదశమికి 'పైసా వసూల్' అంటుండడం ప్రత్యేకంగా పరిగణించాల్సిన అంశం.
|