తెలుగు సినిమాని ఓ వైపు నుంచి పైరసీ, ఇంకో వైపు నుంచి లీకేజీలు పట్టి పీడిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు నుంచే చిత్ర దర్శక నిర్మాతల్ని లీకేజీలు భయపెడుతోంటే, సినిమా విడుదలయ్యాక పైరసీ భయాందోళనకు గురిచేస్తోంది. చట్టాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వాల ప్రోత్సాహం ఈ విషయంలో లభిస్తున్నప్పటికీ నిర్మాత మాత్రం తన సినిమాని ధైర్యంగా సినిమాలు నిర్మించి, హాయిగా సినిమాల్ని విడుదల చేసుకునే పరిస్థితి ముందు ముందు కనిపించకపోవచ్చు.
'జై లవకుశ' సినిమా నిర్మాత కళ్యాణ్రామ్, సినిమా విడుదలకు ముందే పోలీసులను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది? 'డిజె దువ్వాడ జగన్నాథమ్' చిత్ర నిర్మాత 'దిల్' రాజు, సినిమా విడుదలయ్యాక పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు? అని ఆరా తీస్తే, ఇద్దరిదీ దాదాపు ఒక్కలాంటి సమస్యే. నిర్మాత ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులు ఈ సినిమాలతో ఇంకోసారి రుజువయ్యాయంతే. 'డిజె దువ్వాడ జగన్నాథమ్' సినిమాని విడుదలైనవెంటనే పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టేశారు. 'జై లవ కుశ' సినిమా టీజర్ని లీక్ చేసి, సినిమాకి పెద్ద సవాల్ విసిరారు. దాంతో, టీజర్ని గ్రాండ్గా లాంఛ్ చేద్దామనుకున్న కళ్యాణ్రామ్ ఆశలు అడియాశలయ్యాయి. 'జై లవ కుశ' లీకు దొంగని పోలీసులు పట్టుకోవడం జరిగింది. 'డిజె దువ్వాడ జగన్నాథమ్' పైరసీ దొంగల్ని పట్టుకోవాల్సి ఉంది. పట్టుకోవడం కాదు, ఇంకోసారి ఇలాంటి దొంగతనాలు జరగకూడదంటే కఠిన శిక్షలు ఉండాలి. అప్పుడే పైరసీ, లీకేజీ భూతాల నుంచి సినీ పరిశ్రమను కాపాడుకోగలం.
|