సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే. తన మాటల్లోనూ, తన చేతల్లోనూ ప్రత్యేకతను చూపే వర్మ, ఇటీవల టాలీవుడ్ దర్శకుడు మధుర శ్రీధర్ కి ఫోన్ చేశారు. అయితే కాలర్ ట్యూన్ గా వర్మకి ‘ఓం సాయి.. ఓం నమ సాయి.. ఓం నమో నమో సాయి.. నీ పేరు తలచిన చాలు.. నా మనసు పరవశించు.. నీ రూప దర్శనంతో నా జన్మే తరియించు..’ అనే పాట వినిపించిందట.
ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన మధుర శ్రీధర్తో మాట్లాడుతూ, ఆ పాట ఏ సినిమాలోదని వర్మ అడిగితే, అది సినిమా పాట కాదు, మధుర ఆడియో రిలీజ్ చేసిన సాయిబాబా పాటల ఆల్బమ్ లోదని సమాధానమిచ్చారట ఆయన. పాట చాలా బాగుందనీ, అయితే ఆ పాటలోని ‘సాయి’ అన్న పేరుని తొలగించి, వేరేలా రాస్తే రొమాంటిక్ సాంగ్ అవుతుందని వర్మ అన్నాడట.
భక్తిలోనూ రక్తిని చూడటమంటే ఇదే. ‘నీ పేరు తలచిన చాలు నా మనసు పరవశించు.. నీ రూప దర్శనంతో నా జన్మే తరియించు’ అన్న లైన్స్ వర్మకి బాగా నచ్చాయి. ‘సాయి’ అన్న పేరు పక్కన పెడితే, ప్రేయసీ ప్రేమికులు పాడుకున్నట్లే వుంది ఇది. అందుకే వర్మ అందరిలోకీ ప్రత్యేకమైన వ్యక్తి అయ్యాడు మరి.
|