బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'జై సింహా'. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. గతేడాది సంక్రాంతికి 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో వచ్చి, మంచి విజయం అందుకున్నాడు బాలకృష్ణ. సంక్రాంతి బాలయ్యకు బాగా కలిసొచ్చే పండగ. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి'తోనే మంచి విజయం అందుకున్నాడు గతేడాది. అప్పుడు బరిలో ఉన్నది మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ అయిన 'ఖైదీ నెం 150'తో పోటీ పడ్డాడు బాలయ్య అప్పుడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్కళ్యాణ్తో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. అప్పుడు అన్నయ్యతో ఇప్పుడు తమ్ముడితోనన్న మాట. ఇదో పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ అట. కె.యస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతారతో పాటు నటాషా దోషి బాలయ్య సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సంగతి అలా ఉంచితే, పొలిటికల్ డైలాగులకు ఎక్కువ ప్రాధాన్యత ఉందట. బాలయ్య నోట అదిరిపోయే పొలిటికల్ పంచ్లు పేలనున్నాయట ఈ సినిమాలో. 'సింహా' బాగా కలిసొచ్చే టైటిల్ బాలయ్యకి. అలా ఈ సినిమాపై టైటిల్తోనే పోజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ నెల 24న విజయవాడలో గ్రాండ్గా 'జై సింహా' ఆడియో ఫంక్షన్ జరగనుంది. గతేడాది రెండు సినిమాలతో విజయం అందుకున్నాడు. ఏడాది స్టారింగ్లో 'శాతకర్ణి'తో వచ్చిన బాలయ్య ద్వితీయార్ధంలో 'పైసా వసూల్'తో వచ్చాడు. ఇక రానున్న కొత్త సంవత్సరంలోనూ బాలయ్య నుండి రెండు సినిమాలు రెడీగా ఉన్నట్లే. ఒకటి 'జై సింహా' కాగా, మరోటి తేజ డైరెక్షన్లో తెరక్కెనున్న 'ఎన్టీఆర్'. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదికెళ్లనుంది. ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారట. ఈ చిత్రంతో బాలయ్య నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమాని సొంత నిర్మాణంలో రూపొందిస్తున్నారు బాలయ్య.
|