Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Hyderabad Book Fair

ఈ సంచికలో >> శీర్షికలు >>

విహారయాత్రలు ( మలేషియ ) - కర్రా నాగలక్ష్మి

maleshiya

( కెమరున్ హైలెండ్స్ )

పినాంగ్ లో ప్రొద్దుట  బయలుదేరి  సాయంత్రానికి వచ్చేటట్టుగా వుండే ప్రదేశాలు పూర్తి చేసుకున్నాక శనివారం ప్రొద్దుటే బయలుదేరి వెళ్లి ఆదివారం రాత్రికి తిరిగి వచ్చేటట్టుగా వుండే ప్రదేశాలు చూడడానికి వెళ్లేవాళ్లం .

అలాంటి ప్రయాణం పెట్టుకొనేటప్పుడు ముందుగా రూము బుక్ చేసుకోవలసి వచ్చేది . ముందుగా బుక్ చేసుకోకుండా వెళ్లి రూము దొరకక తిరిగి వెనక్కి రావలసి వచ్చింది . అప్పటినుండి బుద్దిగా ముందుగా రూము బుక్ చేసుకొని వెళ్లేవాళ్లం .

మలేషియా లో హోటల్స్ తో పాటు సర్వీస్డ్ అపార్ట్ మెంట్స్ కూడా వుంటాయి . సర్వీస్డ్ అపార్ట్ మెంట్స్ అయితే హోటల్ రూమ్స్ కన్నా చవుకగా వుండి కిచెన్ కూడా వుంటుంది , కిచెన్ లో గేస్ స్టౌ , ఫ్రిడ్జ్ , మైక్రొవేవ్ , ప్లేట్లు , గిన్నెలు లాంటివన్నీ వుంటాయి . అంటే వంటసామానులు తీసుకు వెళితే మనం వండుకోవచ్చు . వండుకోడానికి వెళ్తున్నామా ? ఓ రోజైనా హోటల్ లో తిని హాయిగా వుండొచ్చుకదా ? అంటే నా దగ్గర సమాధానం లేదుగాని , ముఖ్యంగా విదేశాలలో మనకి కావలసిన తిండి ఒకటి రెండు చోట్ల తప్ప దొరకవు . వాటిని వెతకడం లో సమయం వృధా చేసుకొనే బదులు రైస్ కుక్కర్ లో  అన్నం పడేసుకుంటే డబ్బు , సమయం , ఆరోగ్యం మూడూ కాపాడుకున్న వాళ్లమవుతాం . చాలా సార్లు మనం తినగలిగే భోజనం వెదుకులాటలోనే సమయం గడిచిపోయి , కొన్ని చోట్ల తిండే దొరకక అభోజనం వుండవలసి వచ్చేది , అలా చాలా సార్లు జరిగేక మా వంట సామగ్రి తో బయలుదేరడం మొదలు పెట్టేం .

మలేషియాలో ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం తో చాలా స్నేహంగా వుండేవాళ్లం . వారికి యిద్దరు చిన్నపిల్లలు . మా రెండు కుటుంబాల వారం బయలుదేరి చుట్టుపక్కల ప్రదేశాలు చూడ్డానికి వెళ్లే వాళ్లం . రెండు బెడ్రూముల అపార్ట్మెంటు బుక్ చేసుకునేవాళ్లం .

ఎప్పటిలాగే మేం కెమరూన్ హైలెండ్స్ లో అపార్ట్ మెంటు బుక్ చేసుకున్నాం . ప్రొద్దుటే బయలుదేరేం . పినాంగ్ నుంచి సముద్రం మీద వున్న వంతెన దాటుకొని మైన్ లాండు చేరి ఉత్తరం వైపు వెళ్లే హైవే మీద ప్రయాణం హాయిగా సాగుతోంది . సుమారు 170 కిలోమీటర్ల ప్రయాణం తరువాత ‘ ఐఫొ ‘ నగరం దగ్గర హైవే నుంచి దారి మళ్లి కొండలమీద సాగుతుంది . కొండలమీద ప్రయాణం అంటే మెలికలు తిరిగి వుండే సన్నని రోడ్డని అనుకుంటే పొరపాటే , కొండమీదకి వెళుతున్నట్లే తెలియలేదు . సుమారు 70 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత కెమరూన్ హైలెండ్స్ చేరేం .

మలేషియ దేశంలో ‘ పహాంగ్ ‘ రాష్ట్రానికి చెందినవి యీ హైలేండ్స్ . ఇవి సుమారు 713 చదరపు కిలోమీటర్లలో వ్యాపించి వున్నాయి . కెమరూన్  హైలేండ్స్ ఉత్తరాన ‘ కలంతాన్ ‘ రాష్ట్రం , పశ్చిమాన ‘ పెరక్ ‘ రాష్ట్రాలను సరిహద్దులుగా కలిగి వుంది .  మలేషియా దేశం లో వున్న ముఖ్యమైన వేసవివిడుదలలో యిదివొకటి . ఇక్కడ గరిష్ఠ వుష్ణోగ్రతలు 25 f డిగ్రీలు కనిష్ఠ వుష్ణోగ్రతలు 10f డిగ్రీలుగా వుంటాయి .
1885 లో బ్రిటిష్ రాజ్ లో అప్పటి సర్వేయరు సర్ విలియమ్స్ కెమరూన్ యీ ప్రాంతాన్ని సర్వే చేసి యిక్కడవున్న కొండలను , జలపాతాలను చూసి ముగ్ధుడై యీప్రాంతాన్ని ఆరోగ్య కేంద్రంగా తీర్చి దిద్దాలనే ఆలోచన చేసేడు . అప్పటినుంచి ఆప్రాంతాన్ని అతని పేరు మీదుగా కెమరూన్ హౌలెండ్స్ గా పిలువబడసాగేయి . దట్టమైన అడవిగా వున్న యీ ప్రాంతం ఆంగ్లేయ ఆఫీసర్లకు నచ్చలేదు . ఔత్సాహిక ఆంగ్లేయులు వేసవిలో యిక్కడ గడపసాగేరు . కాని కెమెరూన్ కోరిక నెరవేర లేదు . అతని తరవాత వచ్చిన ఆంగ్లేయులు తగినంత శ్రద్ద తీసుకోలేదు . 40 సంవత్సరాల తరువాత వచ్చిన మేక్స్ వెల్ అనే సర్వేయరు యీ ప్రాంతాలలో 9 రోజులు పర్యటించి దీనిని వేసవి విడిదిగా తీర్చి దిద్దేడు . 1925 లో యిక్కడ అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంట్ స్టేషన్ స్ధాపించి దాల్చిని , టీ , కాఫి , పళ్లు , కూరలు పండించ సాగేరు . రెండు  ప్రపంచ యుధ్దాలు రావడం రెండవ ప్రపంచయుధ్దంలో మలేషియా జపాను వారు గెలుచుకోడం వీటితో యీ ప్రాంతం తిరిగి మరుగున పడిపోయింది .

మలేషియా స్వాతంత్రం పొందిన తరువాత దీనిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేరు . ఈ హైలేండ్స్ లో అడుగు పెట్టిన దగ్గరనుంచి మనకు దూరంగా కొండలమీద దగ్గరగా వున్న కొండచరయలలో టీ ప్లాంటేషను కనువిందు చేస్తూ వుంటుంది . ఈ హైలేండ్స్ లో చాలా ప్రదేశాలు దట్టమైన మేఘాలతో కప్పబడి వుంటాయి . కొన్ని చోట్ల వెహికల్ లోంచి దిగి నడవడానికి వీలుని కల్పించేరు అక్కడ నడుస్తూ వుంటే మేఘాలు మనని  తాకుతూ శరీరాలను తడిపి వెళ్లి పోవడం గమ్మత్తుగానూ కొత్తగానూ వుంటుంది . కొండపై నుంచి చూస్తే క్రింద నేల కనబడకుండా కప్పేసిన మేఘాలను చూడడం కూడా గమ్మత్తుగా వుంటుంది . టీ తోటలో   సన్నని బాట మీదుగా నడుస్తూ తేయాకు ఘుమఘుమలను ఆశ్వాదించడం , కాఫీ తోటలలో కాఫీ కాయలను పండ్లను చూడ్డంకూడా మొదటిమారు కావడంతో  అదో వింతైన అనుభూతినిచ్చింది .

కెమరూన్ లో వివిధ ప్రాంతాలలో ‘ స్ట్రాబెర్రీ ఫార్మ్ ‘ , ఆర్కిడ్ ఫార్మ్ , దాల్చిని ఫార్మ్ ముఖ్యంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి . దాల్చిని మొక్కలు గుబురుగా నాలుగయిదు అడుగుల యెత్తులో వున్నాయి . మలేషియా వెళ్లిన వాళ్లు ముఖ్యంగా దాల్చిని , లవంగాలు మంచిరకంవి దొరుకుతాయి , వీటిని కొనుక్కోడం మరచిపోకండి .

స్ట్రాబెరీ ఫార్మ్ లో స్ట్రాబెరీలను అంతస్థులుగా కట్టిన కర్ర బల్లలపై కొబ్బరిపీచు వేసి మొక్కలు పెంచి పండ్లను పండిస్తున్నారు . మన దేశంలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ స్ట్రాబెరీ ఫార్మ్స్ కి ప్రసిధ్ది . అక్కడ నేలమీద అంటే మట్టిలోనే పండించడం అదీ కొన్ని వందల యెకరాలలో పండించడం చూసేం కాని యిక్కడ యిలా అంతస్థులలో మన్ను లేకుండా పెంచడం ఆశ్చర్యాన్ని కలుగ జేసింది .

కాయగూరలు పండించే ఫార్మ్ చూడ్డానికి బాగున్నాయి . పందిరినుంచి వ్రేలాడుతున్న ఆనపకాయలు , పొట్లకాయలు కనువిందు చేస్తాయి .
ఆర్కిడ్ ఫార్మ్ లో కొన్ని వందల ఆర్కిడ్స్ పూత చూసి కళ్లు తిప్పుకోలేకపోయేం . 40 , 50 రకాల ఆర్కిడ్స్ ని పెంచుతున్నారు . ఈ ఆర్కిడ్స్ చాలా సున్నితమైన జాతి పూలమొక్క . చాలా జాగ్రత్తగా పెంచాలి . చాలా జలపాతాలను చూసేం . ఇక్కడ వున్న గోల్ఫ్ కోర్సు 18 కన్నాలు వున్నది . గోల్ఫ్ మైదానాన్ని అందులో వున్న కన్నాలను బట్టి పెద్దదో చిన్నదో నిర్ణయిస్తారు . టీ మొక్కలతో నిండిన కొండలు , అడవుల మధ్య పెద్ద గల్ఫ్ కోర్స్ అహ్లాదకరంగా వుంటుంది .

తేనెటీగల ఫార్మ్ , బటర్ఫై పార్క్ చూసేం . ఇవన్నీ చూడ్డానికి ఒకరోజు చాలు . మరునాడు కొండల మీద వున్న టీ తోటలకు వెళ్లి ఓ పూట గడిపేం . ఎక్కడా పొల్యూషన్ లేని గాలి , మబ్బులు శరీరాన్ని తాకుతూ వెళుతుంటే యెంతో హాయిగా వుంటుంది .

కౌలాలంపూర్ నుంచి కెమరున్ హైలేండ్స్ రావాలంటే సుమారు 206 కిలోమీటర్లు ప్రయాణించ వలసి వుంటుంది .

ఐపొహ్ —-

పెరక్ రాష్ట్ర రాజధాని ‘ ఐపొహ్ ‘ . ఈ నగరం పినాంగ్ కౌలాలంపూర్ హైవే మీద వుంది . కౌలాలంపూర్ నుంచి సుమారు 180 కిలో మీటర్ల దూరంలోనూ , పినాంగ్ కి 120 కిలోమీటర్ల దూరం లోనూ వుంది . ‘ సుంగై కింత ( కింత నది ) ‘ తీరాన నిర్మింపబడ్డ నగరం . ఈ నగరం విద్య , వాణిజ్య , పర్యాటక పరంగా ప్రాముఖ్యతను సంతరించుకున్న పట్టణం . ఈ నగరం లో కూడా చైనా , భారత దేశానికి చెందిన వారు యెక్కువగా కనిపిస్తూ వుంటారు . భారతదేశ వంటలతో పాటు చైనీస్ , మలయ వంటకాలను అందించే అనేక రెష్టారెంట్స్ వున్నాయి .

పినాంగ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు హైవే నుంచి  కొన్ని గుహలు కనిపిస్తూ వుండేవి . అక్కడకి చేరే దారి మాత్రం కనిపించేది కాదు . రెండుమూడు సార్లు ప్రయత్నించినా చేరలేక పోయేం . ఓ సారి యెలాగైనా చేరాలని నిశ్చయించుకొని ప్రత్నించి చేరలేక అక్కడవున్న ఓ మలేషియన్ తమిళ యింటి తలుపు కొట్టి వచ్చీరాని తమిళంలో గుహలకు దారి అడిగితే ఆ యింటివాళ్లు చాలా సంతోషించి అథిధి మర్యాదలు చేసి మమ్మలని గుహలవరకు తీసుకువెళ్లి వెనుకకి వెళ్లిపోయేరు . ఇవి చైనీస్ వారిచే నిర్మింపబడ్డ బౌద్ద గుహలు .   ఐపొహ్ కి   ఉత్తర దక్షిణాలుగా 20 కిలోమీటర్లు సున్నపు రాతి కొండలువ్యాపించి వున్నాయి . నిరంతరంగా యీ సున్నపు రాతి కొండలలో పడే నీటివల్ల యీ గుహలు యేర్పడ్డాయి .  అయితే యీ గుహలన్నీ దట్టమైన అడవులలో కొండలమీద వుండడంతో అక్కడకు చేరడం కష్టం . ప్రస్తుతం సుమారు మూడు కిలోమీటర్లమేర నడవడానికి వీలుగా కట్టి పర్యాటకుల కోసం తెరచేరు . మిగతావాటిని పర్యాటకులు సులువుగా చేరేటట్లు యేర్పాట్లు జరుగుతున్నాయి . ఈ మూడు కిలోమీటర్ల గుహలలో లైట్లు , జారిపోకుండా పట్టుకు నడవడానికి రైలింగు యేర్పాట్లు చెయ్యబడ్డాయి . ఇక్కడ ప్రాకృతికంగా యేర్పడ్డ ఆకృతులే కాక చైనీస్ బౌద్ద విగ్రహాలను కూడా పెట్టేరు . వీటిని ‘ లింగ్ సేన్ తొంగ్ ‘ , ‘ నాన్ తియన్ తొంగ్ ‘ , క్వాన్ యిన్ తొంగ్ ‘ , ‘ పెరక్ తొంగ్ ‘ అనే మందిరాలుగా పిలుస్తారు .

ఈ గుహలలో అక్కడక్కడ నీరు కారుతూ వుండడంతో లోపలంతా జారుడుగా వుంటుంది .

ఈ ప్రయాణం లో మాకెదురైన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను అదేమిటంటే ఏ దారిలో వెళ్లాలో మీకు తెలీకపోతే స్థానికులను గాని , భారతీయ సంతతికి చెందిన వారిని గాని అడగండి గాని పొరపాటున యే చైనీయులనీ అడగకూడదు  , యెందుకంటే చాలాసార్లు అలా దారి అడిగితే అక్కడున్న చైనీయులు ఒకొక్కరు వ్యతిరేక దిశలను చూపిస్తూ యెవేవో చెప్పేవారు , అలా చెప్పేటప్పుడు వారిలో వారికే వాదన వచ్చేది ,  వారు పోట్లాడుకోవడంతోనే సరిపోయేది గాని అరగంటయినా వారి వాదన ముగింపుకి రాకపోవడం , ముగింపుకి వచ్చేక మాలో మాకు తగవులు పెడతార్రా అని మమ్మలని కొట్టడానికి వస్తారేమో అని భయమేసి అక్కడనుంచి వెళ్లిపోయేవారం . అలా చాలా సార్లు జరిగేక మేము చైనీయులతో మాట కలపాలనే ఆలోచన విరమించుకున్నాం .

ఇలా ఓ సారి మేం దారి వెతుక్కుంటూ వెళుతూ వుంటే ఓ బోర్డు మా దృష్టిలో పడింది , దాని మీద పురాతనమైన హిందూ మందిర సముదాయం అని వుంది . అది యే నగరానికి దగ్గరగా వుందో వివరాలు గుర్తులేవు , అలా గుర్తులను పట్టుకొని అక్కడకు వెళ్లేం . ప్రస్తుతం మందిరం లాంటిదేమీ లేదు . శిధిలాలు మాత్రం వున్నాయి . శిధిలాలు అంటే పునాదులు మాత్రమే వున్నాయి , విరిగి పడిపోయిన రాళ్లు మాత్రమే వున్నాయి , కాని వాటిని చాలా జాగ్రత్తగా పేర్చి అక్కడ ఓ ఛండీ మాత మందిరం వుండేదని , ఆ మందిరం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన హిందూ రాజులు కట్టించేరని , ప్రకృతి వైపరీత్యాలవల్ల , మతోన్మాదుల కోపానికి గురై పాడుపడిందని రాసి వుంది . అమ్మవారు వున్న ప్రదేశం కూడా గుర్తించేరు , ఆ ప్రదేశం ఆర్కియాలజీ వారి సంరక్షణ లో వుంది . ఒక ముస్లిం దేశం నిజాయితీగా మందిరం గురించిన వివరాలను తెలియజెయ్యడం ఆ దేశం మీద మరింత గౌరవాన్ని కలిగించింది .

పినాంగ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లేటప్పుడు ఐపొహ్ దాటేక ఓ పెద్ద రాయి యేనుగు ఆకారంలో కనిపిస్తుంది సుమారు 20,25 అడుగుల యెత్తు వుండొచ్చు . దానిని ‘ బతు గజ ‘ అంటారు , దానికి దగ్గరగావున్న నగరాన్ని బతుగజ అని అంటారు . బతుగజ అంటే యేనుగాకారంలో వున్న రాయి అని అర్దం . గజ అంటే యేనుగు , గజం కొలత అని నానార్దాలు వున్నాయి , మలయా వాళ్లకి కూడా . ఏనుగులా చెక్కి కాదు  ఓ పక్క నుంచి చూస్తే యేనుగులా కనిపించే రాయి  .

ఈ వారం యిది చదవండి , పై వారం ‘ జెంటింగ్ హైలేండ్స్ ‘ గురించి చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
jayajayadevam