'పద్మావత్' సినిమాని బ్యాన్ చేయాలంటూ రాజ్పుత్ కర్ణిసేన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపిన సంగతి తెలిసిందే. చరిత్రని వక్రీకరిస్తున్నారంటూ, రాజ్పుత్ రాణీ పద్మినీ దేవి ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఈ చిత్రంలోని సన్నివేశాలున్నాయంటూ కర్ణిసేన ఆందోళనలు చేపట్టింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాని బ్యాన్ చేశారు కూడా. అయితే ఇదంతా గడిచిపోయిన సంగతి. వివాదాలెన్ని వచ్చినా, కొంచెం ఆలస్యంగానైనా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి విజయం అందుకుంది. ఆందోళనకారులు వివాదాలు సృష్టించినట్లుగా సినిమాలో ఎలాంటి అభ్యంతరాలు లేవని తర్వాత తేలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సినిమాని ఇలాంటి వివాదాలే చుట్టుముట్టాయి. ప్రముఖ దర్శకుడు క్రిష్ బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న చిత్రం 'మణికర్ణిక'. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథనందించారు.
అయితే ఈ చిత్రం ఇప్పుడు వివాదాల్లోకెక్కింది. కారణం ఏంటంటే.. ఏముంటుంది చరిత్రని వక్రీకరించారనే. రాజస్థాన్ సర్వ బ్రాహ్మణ సంఘం ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయనీ ఆరోపిస్తూ, చిత్ర యూనిట్కి హెచ్చరికలు జారీ చేస్తూ, ఓ లేఖ పంపిందట. అక్కడితో వివాదాలు చెలరేగాయి. దేశం కోసం బ్రిటీష్ వారితో ప్రాణాలకు తెగించి పోరాడిన వీరనారి ఝాన్సీలక్ష్మీభాయ్కి, ఓ బ్రిటీష్ వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా ఈ సినిమాలో చూపిస్తున్నారంటూ ఈ సర్వ బ్రాహ్మణ సంఘం ఆరోపిస్తోంది. వీరికి రాజ్పుత్ కర్ణిసేన అండగా నిలిచింది. సినిమాలో అలాంటి సన్నివేశాలున్నాయా? లేదా అనే విషయంపై చిత్ర యూనిట్ తమకి క్లారిటీ ఇవ్వాలనీ ఆందోళనకారులు కోరుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమా బాలీవుడ్తో పాటు, దక్షిణాది భాషల్లో కూడా విడుదల కానుంది. చూడాలి మరి వివాదాలను నెట్టుకుని 'మణికర్ణిక' ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో!
|