నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' ఓ పక్క, మెగా ప్రిన్స్ వరుణ్తేజ్ నటించిన 'వాల్మీకి' ఇంకో పక్క. ఈ రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలకు సిద్ధమయ్యాయి. అదే సెప్టెంబర్ 13. అంచనాల పరంగా రెండు సినిమాలకీ బజ్ బాగానే ఉంది. దాంతో, నిర్మాతలు రిస్క్ చేయలేదు. రెండు సినిమాలకు సంబంధించిన నిర్మాతలు కలిసి కూర్చొని, సామరస్యంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంలో భాగంగా, 'వాల్మీకి' టీమ్ ఓ వారం వెనక్కి తగ్గింది. అనుకున్న టైంకి 'గ్యాంగ్లీడర్'ని విడుదల చేసుకోమంది. అలా నాని 'గ్యాంగ్ లీడర్'కి లైన్ క్లియర్ అయ్యింది. నిజానికి 'గ్యాంగ్ లీడర్' ఆగస్ట్ 30న విడుదల కావల్సి ఉంది. 'సాహో' కారణంగా ఈ సినిమాని ఒకసారి వాయిదా వేశారు. మళ్లీ వాయిదా వేస్తే సిట్యువేషన్స్ ఎలా ఉంటాయోననే అనుమానంతో, ఆరోగ్యకరమైన వాతావరణంలోనే 'వాల్మీకి' నిర్మాతలు 'గ్యాంగ్ లీడర్'కి స్పేస్ ఇచ్చేశారు. ఈ మార్పు బాక్సాఫీస్కి మంచిదే.
వసూళ్ల పరంగా రెండు సినిమాలూ ఆశించిన ఫలితాన్ని అందుకోవడానికి ఈ మార్పు ఖచ్చితంగా యూజ్ అవుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. తమ సినిమా కోసం త్యాగం చేసి వెనక్కి తగ్గిన వరుణ్ తేజ్, హరీష్ శంకర్కి 'గ్యాంగ్ లీడర్' టీమ్ మనస్పూర్తిగా థాంక్స్ చెప్పింది. ఇకపోతే, 'గ్యాంగ్ లీడర్' విషయానికి వస్తే, లేటెస్ట్గా విడుదలైన ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకుడు. 'ఆర్ఎక్స్ 100' ఫేం కార్తికేయ విలన్గా నటిస్తున్నాడు.
|