తెరపై అందంగా కనిపించడమొక్కటే కాదు, నటనలో సత్తా చాటుకునే విలక్షణ పాత్రల్నీ హీరోయిన్లు ఎంచుకోవడానికి ఇష్టపడతారు. కానీ వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. హిందీ తెరపై హీరోయిన్లు కేవలం గ్లామర్ ని మాత్రమే నమ్ముకోకుండా యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉవ్విళ్ళూరడం ఎక్కువగా కనిపిస్తోంది కొన్నేళ్ళుగా. ఆ కోవలో చేరిపోయింది హీరోయిన్ రాణీ ముఖర్జీ.
మర్దానీ అనే సినిమాలో ఎగ్రెసివ్ గా కనిపించబోతున్న రాణీ ముఖర్జీ ఈ సినిమా కోసం గన్ను పట్టింది కూడా. రివెంజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత ఆదిత్య చోప్రా. గొప్ప గొప్ప పాత్రలు అరుదుగా లభిస్తాయని వాటిని వదులుకోకూడదని అలాంటి అవకాశమే తనకు మర్దానీ రూపంలో దక్కిందని రాణీ ముఖర్జీ చెప్పింది.
ఎవ్విరీ వార్ ఈజ్ పర్సనల్ అనే ట్యాగ్ లైన్ తో ఈ మర్దానీ ప్రేక్షకులను అలరించనున్నది. ఆగస్ట్ 22న చిత్రాన్ని విడుదల చేస్తారు. హీరోయిన్ గా హిందీ సినిమాల్లో ఒకప్పుడు నెంబర్ వన్ అనిపించుకున్న రాణీముఖర్జీ కొన్నేళ్ళుగా ఎంపిక చేసిన చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. వాటిల్లో కొన్ని పరాజయం పాలైనా, కథల ఎంపికలో రాణి చూపిస్తున్న విలక్షణతకు మంచి మార్కులు దక్కుతున్నాయి.
|