తారాలోకం కదిలొచ్చింది. నీకన్నా ఎక్కువ నేను అన్న చందంగా విరాళాలు ఇవ్వడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. లక్ష నుంచి యాభై లక్షల దాకా సినీ పరిశ్రమలో చాలామంది తారలు తుపాను బాధితుల్ని ఆదుకోవడంలో ముందుకు వచ్చారు. తారాలోకం అంటే అదెక్కడో లేదు, మేం తారల్లా వెలుగుతున్నామంటే అది మీ చలవే అని చెప్పే సినీ ప్రముఖులు తమ మాటలు గుండెల్లోంచి వచ్చినవని తుపాను బాధితులకోసం విరాళాలు ప్రకటించడం ద్వారా నిరూపించుకున్నారు.కమెడియన్ నుంచి స్టార్ హీరో వరకూ స్పందించారు. హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, ఇతర టెక్నిషియన్లు.. ఒకరేమిటి, సినీ పరిశ్రమకు చెందిన అన్ని విభాగాల వారూ విరాళాలు ఇచ్చారు.
విరాళాలు ఇవ్వడమే కాక బాధితుల్ని పరామర్శించడానికి కూడా కొందరు వెళ్ళారు. ‘మేం రావడం వల్ల సహాయక కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుంది’ అని భావించిన కొందరు పరామర్శలకు కొంచెం దూరంగా ఉన్నారుగానీ, వారు కొన్ని రోజులు ఆగిన తర్వాత బాధితుల వద్దకు వెళ్ళడమూ జరుగుతుంది.వ్యక్తిగత విరాళాలు కాకుండా, ఓ మెగా ఈవెంట్ నిర్వహించి, దాని ద్వారా వచ్చే భారీ మొత్తాన్ని సినీ పరిశ్రమ తరఫున బాధితుల కోసం అందిస్తామని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు మురళీమోహన్ చెప్పారు. సినీ పరిశ్రమ ఉదారతకు హేట్సాఫ్ చెప్పాలి ఎవరైనా.
|