ఆంధ్ర షెల్లీ - ambadipudi syamasundar rao

ఆంధ్ర షెల్లీ
తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ముఖ్య అధ్యాయం.కృష్ణ శాస్త్రి తన భాధను అందరితో పంచుకొనేవాడని చలము చెపుతూ ఉండేవాడు శ్రీశ్రీ, దేవులపల్లి ఇద్దరు భిన్న దృక్పధాలకు విభిన్న మార్గాలకు ప్రాతినిధ్యము వహించిన మహాకవులు . ఆపాత మధురమైన కృష్ణశాస్ర్తి సాహిత్యం ఇక్షురసార్ణవం వంటిదని శ్రీశ్రీ శ్లాఘించారు. 1910-20 మధ్యకాలములో తెలుగు సాహిత్యములో ప్రారంభమయిన భావ కవిత్వ ఉద్యమాన్ని అఖిలాంధ్ర వనిలో ప్రాచుర్యము కల్పించిన వాడు దేవులపల్లి .1930 దశాబ్దిలో భావ కవిత్వానికి విరుద్ధముగా విజృంభించిన అభ్యుదయ కవితా ఉద్యమాన్ని ఆశ్వీరదించి అభ్యుదయ రచయితల సంఘము వార్షిక సభలకు అధ్యక్షత వహించి వారిని ప్రోత్సహించాడు.కృష్ణ శాస్త్రి గేయాలలో కవితా శిల్పం, గాన శిల్పం రెండు పుష్కలముగా ఉండేవి. అయన అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారుల శ్రేణిలో నిలువదగిన వాడని మేధావుల మరియు సాహితి విమర్శకుల అభిప్రాయము ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు పద్యాలూ, గేయాలు,పాటలు గేయనాటికలు,.సంగీత రూపకాలు, సాహిత్య ప్రసంగాలు, యక్షగానాలు వంటివి అయన విలక్షణ లేఖిని నుండి నిరంతరమూ వెలువడినాయి. చిన్న వయసునుండే అయన రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగా పుట్టినారని విశ్వనాధ సత్యనారాయణగారు తన అభిప్రాయం గా చెప్పారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్ఠి జరుగుతూ ఉండేది. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు.
ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉండటము వలన కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదే సమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే "ఊర్వశి" అనే కావ్యం వ్రాశాడు.
1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు ఈయన .సినిమా పాటకు కావ్య గౌరవం కలిగించారు. లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం రాజమకుటం, సుఖదుఃఖాలు, కలిసిన మనసులు, అమెరికా అమ్మాయి, గోరింటాకు మొదలైన చిత్రాల్లో 170 పాటలు మాత్రమే రాసిన, అంటే తక్కువ పాటలు వ్రాసిన కవి. గుర్తింపు పొందిన కవులను జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే (1931 నుండి ఎనిమిది పదుల కాలములో సుమారు 400 మంది కవులు 34,000 వేల సినిమా పాటలు వ్రాస్తే) అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు దేవులపల్లి కృష్ణశాస్త్రి
1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు.గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి1975 లో అక్న్ద్ర విశ్వ విద్యాలయము కళాప్రపూర్ణ బిరుదు తో, 1976 లో భారత ప్రభుత్వము పద్మభూషణ్ బిరుదుతో, 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో ఆయనను సన్మానించారు. ఆంధ్ర దేశములో ఆయనను సన్మానించని సాహితి సంస్థ లేదని చెప్పవచ్చు1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించారు కృష్ణ శాస్త్రి పలికిన వ్రాసిన ప్రతి పదము తెలుగు భాషామతల్లికి ఒక అందమయిన,అమూల్యమైన అలంకారము. కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ వింజమూరి అనసూయా దేవి.