పంచతంత్ర కథలు కేవలం పిల్లలకు నీతులు నేర్పడానికే కాదు, జీవితంలో ఎంతో అనుభవం సంపాదించిన పెద్దలకు కూడా ఎన్నో విషయాలు నేర్పుతాయి. దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాసిన ఈ కథలు ఇప్పటికీ ఎంతో ఆచరణాత్మకంగా ఉన్నాయి. ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా సలహాలు ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, మరియు వాటిని వినేవారు ఎలా స్పందిస్తారో తెలుసుకుందాం.
ఒక అడవిలో కోతుల గుంపు ఉండేది. చలికాలం వచ్చి, భారీ వర్షాలు కురుస్తున్నాయి. చలికి తట్టుకోలేక కోతులు, ఎరుపు రంగులో ఉన్న పండ్లను చూసి, వాటిని నిప్పు కణికలు అనుకుని గడ్డి, ఆకులు పోగు చేసి ఊదుతున్నాయి.
చెట్టుపై కూర్చుని సూచిముఖ అనే ఒక పక్షి ఈ కోతుల ప్రయత్నాన్ని చూసింది. వాటి ప్రయత్నం వృధా అని గ్రహించి, "ఓ మూర్ఖులారా, అవి నిప్పు కణికలు కాదు, ఎరుపు పండ్లు. వాటిపై ఊది ఎందుకు మీ శక్తి వృధా చేస్తున్నారు? ఇది మిమ్మల్ని చలి నుంచి కాపాడదు. వెళ్లి గుహలోనో, గాలి తగలని చోటులోనో ఆశ్రయం కనుక్కోండి. మేఘాలు దట్టంగా ఉన్నాయి, వర్షం వెంటనే తగ్గే అవకాశం లేదు" అని చెప్పింది.
కోతుల్లో ఒకటి కోపంతో, "నువ్వెవరు మా పనుల్లో జోక్యం చేసుకోవడానికి? వెళ్లిపో" అని అరిచింది. కానీ సూచిముఖ వాటి మాటలు వినకుండా, ఆశ్రయం వెతకమని పదే పదే సలహా ఇస్తూనే ఉంది. కోతులు దాని సలహా పట్ల చిరాకు పడి, వాటిలో ఒకటి పక్షిని పట్టుకుని, ఒక రాయికి కొట్టి చంపేసింది.
నీతిశాస్త్రం
ఈ కథలోని నీతి ఏమిటంటే - బుద్ధిలేని వారికి సలహా ఇవ్వడం వ్యర్థం. వారు సలహాను పట్టించుకోకపోవడమే కాకుండా, సలహా ఇచ్చిన వారి పట్ల ద్వేషాన్ని పెంచుకోవచ్చు. సలహా అడిగితేనే ఇవ్వడం మంచిది.
కార్పొరేట్ ప్రపంచంలో ఈ నీతి ఎంత ముఖ్యం?
- సలహాలు, సూచనలు: ఆఫీసులో కొందరు, అడగకుండానే ఇతరులకు సలహాలు, సూచనలు ఇస్తారు. అవి మంచివైనా సరే, వినేవారు వాటిని చిరాకుగా భావించవచ్చు.
- అహంకారపూరిత స్వభావం: ఆఫీసులో కొందరు తమ అహంకారం వల్ల ఇతరుల మంచి సలహాలను కూడా వినరు. అలాంటి వారికి సలహా ఇవ్వడం వల్ల వృధా.
- కొత్త ప్రాజెక్టులలో: కొత్త ప్రాజెక్టులలో, కొందరు తమ పద్ధతులను మార్చుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారికి బలవంతంగా సలహాలు ఇవ్వడం వల్ల కోతిలాగే కోపం తెచ్చుకోవచ్చు.
వ్యక్తిగత జీవితంలో ఒక ఉదాహరణ:
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఏదైనా విషయంలో తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు, వారికి ఎంత చెప్పినా వినకపోవడం. అప్పుడు అనవసరంగా వారికి చెప్పడం వల్ల వారి పట్ల కోపం పెంచుకోవడమే కాకుండా, మనకే చిరాకు వస్తుంది. అలాంటి సందర్భాలలో, వారు అడిగితేనే సలహా ఇవ్వడం మంచిది.
ఆ రోజు ఆ సూచిముఖ పక్షి, కోతులకు మంచి సలహా ఇద్దామని ఎంత ప్రయత్నించింది! కానీ చివరికి కోతుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఈరోజుల్లో ఆఫీసులో కూడా చాలామంది 'సూచిముఖ పక్షి' లాగే ఉంటారు. ఇతరులకు మంచి చేద్దామని సలహాలు ఇస్తారు. కానీ వినేవారు 'కోతులు' లాగే ఉంటారు. సలహా వినకపోవడమే కాకుండా, కోపంతో పక్షిని రాయికి కొట్టినట్టు, మన పని పట్టగలరు కాబట్టి, ఆఫీసులో అయినా, జీవితంలో అయినా... సలహాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త! లేకపోతే కోతులు మిమ్మల్ని రాయికి కొట్టినట్టు... సారీ, HR కి కంప్లైంట్ చేయగలరు సుమా!

