శృతిహాసన్ తమిళంలో 'సంఘమిత్ర' సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ఏకంగా కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ఘనంగా లాంఛ్ చేశారు కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఇందుకు కారణం శృతి అని చెప్పక తప్పదు. ఎందుకంటే శృతిహాసన్ ఈ సినిమా నుండి తాను తప్పుకుంటున్నానని అధికారికంగా ప్రకటించింది. నటీనటులన్నాక సినిమాలను ఒప్పుకోవడం, పలు కారణాలతో తప్పుకోవడం సాధారణ విషయమే. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. శృతి ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కారణం ఈ సినిమాకి ఇంకా కథ సిద్ధం కాలేదు. సినిమాకి సంబంధించి ఏ విషయంలోనూ చిత్ర యూనిట్కి క్లారిటీ లేదు అని ఆరోపిస్తూ, క్లారిటీ లేని సినిమా కోసం తన డేట్స్ రెండేళ్ల పాటు కేటాయించలేను అని వ్యాఖ్యానించింది.
దాంతో శృతి మాటలు పెద్ద దుమారమే లేపాయి. ఈ రకమైన శృతి అనూహ్య వ్యాఖ్యలకు చిత్ర యూనిట్ ఘాటుగా స్పందించింది. అత్యంత భారీ బడ్జెట్గా 200 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కథ ఇంకా సిద్ధం కాలేదు అని శృతి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందంటూ.. అసలు శృతి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందనీ, ఈ వివాదంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సుందర్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. శృతి ప్రవర్తనతో ఇప్పుడు 'సంఘమిత్ర'లో శృతి ప్లేస్ని రీప్లేస్ చేసే హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ వేట మొదలుపెట్టింది. ఈ పాత్ర కోసం త్రిష, కాజల్, అనుష్క తదితర సీనయర్ హీరోయిన్ల పేర్లు లిస్టులో చేరాయి. ఇంత గొప్ప చారిత్రాత్మక చిత్రంలో నటించే ఆ గొప్ప అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలిక.
|