క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు నందమూరి బాలకృష్న ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రం పేరు 'యోధుడు' అని పెట్టాలనుకుంటున్నట్లు సమాచారమ్. క్రిష్ చిత్రాలు విభిన్నంగా ఉంటాయని అందరికీ తెలుసు. తొలిసారి ఆయన ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. క్రిష్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటాయిగానీ, కమర్షియల్ సక్సెస్ విషయంలోనే కొంచెం అటూ ఇటూగా ఉంటాయి. అయితే బాలకృష్ణ, క్రిష్ని పూర్తిస్థాయిలో నమ్మి, 'యోధుడు' సినిమాని చేస్తున్నాడట. దానికి కారణం, క్రిష్ టేకింగ్ మీద బాలయ్యకున్న నమ్మకమే. ఈ సినిమా కోసం క్రిష్, బాలయ్యను గుర్రపు స్వారీ నేర్చుకోవాలని కోరడంతో, బాలయ్య ఉత్సాహంగా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్లు సమాచారమ్. ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నిపుణుల్ని తీసుకొచ్చి, బాలయ్య గుర్రపు స్వారీని ప్రాక్టీస్ చేస్తున్నాడట. గతంలో పలు సినిమాల్లో బాలకృష్ణ గుర్రపు స్వారీ చేసినా, ఈ మధ్యకాలంలో బాలయ్య గుర్రం మీద కన్పించలేదు. దాంతో, తమ అభిమాన హీరో గుర్రపు స్వారీ చేస్తోంటే చూసి తరించాలని అభిమానులూ ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి. ఇది బాలకృష్ణకు వందవ సినిమా.
|