తెలంగాణ ఉద్యమం దెబ్బకి కొన్ని సినిమాలు తీవ్రంగా నష్టపోయాయి. సమైక్యాంధ్ర ఉద్యమంతోనూ అదే పరిస్థితి. ఆరు నెలల వరకూ సమైక్య ఉద్యమం ఉధృతంగా కొనసాగించాలని సీమాంధ్ర ప్రాంతంలోని సమైక్యవాదులు అనుకుంటున్నారన్న వార్త తెలుగు సినీ వర్గాల్లో పెద్ద బాంబు పేల్చుతోంది. ఓ పెద్ద సినిమా విడుదల వాయిదా పడితే, వారం రోజులు వాయిదా పడినా కోట్లలో నష్టం వస్తుందంటారు. ‘ఎవడు’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు ఆగిపోవడంతో ఆ నష్టం ఎంతుంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా విడుదల కావాల్సి ఉన్నది.
ఇవే కాదు, చాలా సినిమాలున్నాయి లైన్లో. ఆరు నెలలపాటు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం జరిగితే, సినిమాలు రిలీజ్ చేసుకోకుండా వుంటారా? తప్పదు, విడుదల చేసి నష్టపోలేరు కదా. ఈ సందట్లో చిన్న సినిమాలు ఎలాగోలా ఉనికిని చాటుకుంటున్నాయి. అందుకు కొంత సంతోషం. కానీ పెద్ద సినిమాలు లేకపోతే, థియేటర్లకూ, నిర్మాతలకూ, సినిమాలపై ఆధారపడ్డవారు ఏమవుతారో. సినిమాలకు ప్రాంతీయ గొడవలు అంటగట్టొద్దని అనడం వరకూ బాగానే వుంటుంది. కానీ, ఇప్పుడు అలా ఎవరూ చెప్పడానికీ సాహసించలేకపోతున్నారు.
ఎందుకంటే, జరుగుతున్నది సకల జనుల సమ్మె. సినిమాలను అడ్డుకోవడం కాదిక్కడ, సినిమాలు విడుదల చేయడానికి థియేటర్లే తెరవడంలేదు సీమాంధ్రలో.
|