అదేంటి అనసూయంటే రష్మికి అస్సలు పడదు కదా. వీరిద్దరి మధ్యా పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది కదా.. మరి ఇదేంటి అనుకుంటున్నారా? ఏమో మరి నిజంగానే చెప్పిందో లేక ఎందుకు చెప్పిందో తెలీదు కానీ, ఈ మాట చెప్పింది మాత్రం ముద్దుగుమ్మ రష్మీనే. అచ్చంగా ఆమె నోటితో ఆమెనే ఈ మాట చెప్పింది. బుల్లితెరపై హాటెస్ట్ యాంకర్గానూ, వెండితెరపై నటిగానూ సత్తా చాటుతోన్న బ్యూటీ రష్మీ ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటల్ని కొన్ని సరదాగా ముచ్చటించింది. 2002లో 'సవ్వడి' అనే సినిమాతో రష్మి సినీ కెరీర్ స్టార్ట్ అయ్యిందట. అయితే దురదృష్టవశాత్తూ ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నటించిన 'హోలీ', శర్వానంద్ నటించిన 'ప్రస్థానం', సుశాంత్ హీరోగా వచ్చిన 'కరెంట్' తదితర చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది. అలా వెండితెరపై చాలా కాలం నుంచే వెలుగుతోంది రష్మి. అలాగే బుల్లితెరతో పరిచయం కూడా రష్మికి ఈ నాటిది కాదు.
అప్పుడెప్పుడో 'యువ' సీరియల్లో నటించింది. ఇప్పుడు 'జబర్దస్త్'తో బుల్లితెరపై పాపులర్ యాంకర్ అయ్యింది. 'జబర్దస్త్' తెచ్చిన పాపులారిటీతోనే వెండితెరపైనా హీరోయిన్గా వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. హీరోయిన్గా 'గుంటూర్ టాకీస్' చిత్రంతో మంచి గుర్తింపు లభించింది రష్మీకి. తర్వాత హారర్ కామెడీ చిత్రాలు చాలానే చేసింది. తాజాగా రష్మి నటించిన 'నెక్స్ట్ నువ్వే' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో రష్మి సెకండ్ హీరోయినే అయినా కానీ ప్రమోషన్ కార్యక్రమాల్లో రష్మినే హైలైట్ అవుతోంది. ప్రోమోస్లోనూ రష్మిదే హవా. సూపర్ హాట్గా కనిపించింది రష్మి ఈ సినిమాలో. గ్లామర్ విషయం రష్మిని అడిగితే, ముద్దుగుమ్మలు అందం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వయసు మీద పడ్డాక అందాలారబోస్తాం అంటే ఎవ్వరూ చూడరు అని చటుక్కున చెప్పేసింది అందాల రష్మి. దటీజ్ రష్మి..హా!
|