ఓ సినిమా టీజర్ని వెయ్యికి పైగా థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించడం, దానికోసం టిక్కెట్లు ఉచితంగానే అయినా ప్రత్యేకంగా బుక్ చేసుకోవడం ఎప్పుడన్నా చూశామా? అది 'రోబో' సీక్వెల్ '2.0' విషయంలో జరిగింది. ఎందుకంటే ఇది శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా. ఇది రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా. 500 కోట్లకు పైగా బడ్జెట్తో '2.0' సినిమా రూపొందింది. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ '2.0' కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమయ్యింది. దుబాయ్లో సినిమా ఆడియో విడుదల ఫంక్షన్ని గతంలోనే అంగరంగ వైభవంగా నిర్వహించేశారు.
అది ఈ సినిమా భారీతనానికి ఓ నిదర్శనం మాత్రమే. పూర్తిగా త్రీడీ ఫార్మాట్లో '2.0' సినిమా టీజర్ ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల చేశారు. సౌండ్ డిటెయిలింగ్, సినిమాటోగ్రఫీ.. అన్నిటికీ మించి విజువల్స్ టాప్ క్లాస్లో వున్నాయి. కాస్సేపు ఇది హాలీవుడ్ అద్భుతమా? అనే అనుమానం కల్గిస్తుంది. రజనీకాంత్, అక్షయ్కుమార్, అమీజాక్సన్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం. అక్షయ్కుమార్ నెగెటివ్ రోల్లో కన్పించబోతున్నాడు. ఓ వింత ఆకారం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంటే, దాన్ని నిలువరించడానికి రోబోని తయారు చేస్తారు. ఇదీ సినిమా కథ. టీజర్తోనే చెప్పాల్సింది చెప్పేశారు. సాంకేతిక హంగుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనే స్థాయిలో శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించడాన్ని అభినందించి తీరాల్సిందే. రజనీకాంత్ అంటే సూపర్ స్టార్.. అలాంటి సూపర్ స్టార్ సినిమా.. ప్రపంచ స్థాయి సాంకేతిక హంగులతో, అదీ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోందంటే.. టీజర్ చూశాక, సినిమా కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడటం అంత ఆషామాషీ విషయం కాదండోయ్.
|