చిత్రం: ఎవడు
తారాగణం: రామ్చరణ్, శృతిహాసన్, అమీ జాక్సన్, సాయికుమార్, అల్లు అర్జున్, కాజల్, రాహుల్దేవ్, జయసుధ, బ్రహ్మానందం తదితరులు
ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
విడుదల తేదీ: 12 జనవరి 2014
క్లుప్తంగా చెప్పాలంటే :
ప్రియురాల్ని కళ్ళెదుటే చంపేసిన దుర్మార్గుల్ని అంతమొందిస్తాడు సత్య. అందర్నీ అంతమొందించేశాక కూడా అతనిపై దాడి జరుగుతుంది. దాడి చేసిందవరు? అని ఆలోచిస్తుండగా తాను తాను కాదని తెలుస్తుంది సత్యకి. అతనెవరు? ఎవరు అతనిపై దాడి చేశారు? ఇది తెలుసుకునే క్రమంలో తన రూపం ఓ గొప్ప వ్యక్తిదని సత్యకి తెలుస్తుంది. ఆ గొప్ప వ్యక్తి ఓ గొప్ప ఆశయ సాధన కోసం జరిపే పోరాటంలో ప్రాణాలు కోల్పోతాడు. అసంపూర్తిగా మిగిలిన ఆ ఆశయాన్ని సత్య ఎలా పూర్తి చేస్తాడు? అన్నదే అసలు కథ. అది తెరపై చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే :
బిగుసుకుపోయే పాత్రలో కన్పించాల్సి రావడం ఏ నటుడికైనా పెద్ద పరీక్షే. ఆ పరీక్షలో రామ్చరణ్ మంచి మార్కులేయించుకున్నాడు. యాక్షన్ సీక్వెన్సెస్లోనూ, ఆ తర్వాత వచ్చే సీరియస్ సన్నివేశాల్లోనూ రామ్చరణ్ ఆకట్టుకుంటాడు. డాన్సుల్లో ఇంకోసారి సత్తా చాటుకున్నాడు చరణ్. ‘ఫ్రీడమ్..’ సాంగ్లో చరణ్ స్టెప్పులకి అభిమానులు ఫిదా అవ్వాల్సిందే. కామెడీ సీన్స్లో ఇంకా పరిణతి సాధించాల్సి వుంది.
హీరోయిన్ల విషయానికొస్తే శృతిహాసన్ సెకెండాఫ్లోనే కన్పిస్తుంది. వున్నంతసేపూ ఫర్వాలేదన్పిస్తుంది, గ్లామరస్గా కన్పించింది. అమీజాక్సన్ బికినీ గ్లామర్ ఒలకబోసింది. నటన పరంగా చెప్పుకోడానికేం లేదు. అల్లు అర్జున్, కాజల్ కాస్సేపు కన్పించినా సినిమా జరుగుతున్నంతసేపూ వారి ఇంపాక్ట్ ప్రేక్షకులపై వుంటుంది.
సాయికుమార్ ఎగ్రెజివ్గా కన్పించాడు. విలనిజంని బాగా పండించాడు. జయసుధ తల్లి పాత్రలో సహజంగా నటించింది. మిగతా పాత్రధారులంతా తమ పరిధుల మేర ఫర్వాలేదన్పించారు. బ్రహ్మానందం నవ్వించడానికి ప్రయత్నించాడంతే. ఫస్టాఫ్లో అల్లు అర్జున్ కాస్సేపే కన్పించినా, చాలాసేపు ఆ ఇంపాక్ట్ ప్రేక్షకులపై వుండిపోతుందని ముందే చెప్పుకున్నాం. ఏం జరుగుతుంది? అన్న ఉత్కంఠ ఇంటర్వెల్ వరకూ ఉందంటే బన్నీ ` కాజల్ల మధ్య కాస్సేపు కెమిస్ట్రీనే. విలన్ గ్యాంగ్పై రివెంజ్ తీర్చుకోవడంలో కొత్తదనమేమీ లేదుగానీ, ఇంటర్వెల్ సీన్తో సినిమా గ్రాఫ్ పైకి లేచింది.
సెకెండాఫ్ మాత్రం ఆసక్తిగా రూపొందించడంలో సఫలమయ్యాడు దర్శకుడు. రొటీన్ ఫార్ములానే అయినా, దర్శకుడు ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేయగలిగాడు. యాక్షన్ బ్లాక్స్ బావున్నాయి. అప్పుడప్పుడూ ట్విస్ట్లతో సినిమాపై ప్రేక్షకుల అటెన్షన్ తగ్గకుండా చేశాడు దర్శకుడు. ఇంకా గ్రిప్పింగ్గా తెరకెక్కించేందుకు అవకాశం వుందని మాత్రం అన్పిస్తుంది. చరణ్ ఇదివరకు చేసిన ‘రచ్చ’, ‘నాయక్’లోని యూత్ లీడర్గానూ లేదంటే జనాన్ని ఉద్ధరించేందుకు నడుం బిగించిన యువకుడిగానూ కన్పించాడు. ఇందులోనూ అదే చేయడంతో కొత్తదనం ఏమీ లేదనిపిస్తుంది. అయినప్పటికీ కమర్షియల్ మాస్ సినిమా కావడం, సంక్రాంతి సీజన్ కలిసి ఎవడుకి పెద్ద ప్లస్గా మారింది.
ఒక్క మాటలో చెప్పాలంటే : కమర్షియల్ మాస్ మసాలా మూవీ ‘ఎవడు’
అంకెల్లో చెప్పాలంటే : 3.25/5
|