పరస్పరం 'నీకు నేనున్నానంటూ' పంచే తీయని భావనే 'ఒకరికి ఒకరు' అనుక్షణం నీ చేయి వదలనంటూ అందించే అభయ హస్తమే 'ఒకరికి ఒకరు' నేను అనే భావన నుండి మనం అనే భావనకు చేసే అందమైన ప్రయాణమే.. ఒకరికి ఒకరు. ఈ ప్రయాణాన్ని మూడేళ్ళ క్రితం ప్రారంభించింది జీ తెలుగు. తొలి సంవత్సరమైన 2012లో ముచ్చటైన జంటలను సత్కరించి అందరినీ ఆనందింపజేసింది. అలాగే రెండవ సంవత్సరమైన 2013 లో 80 వసంతాల తెలుగు సినీసీమలోని ఆణిముత్యాలైన జంటలకు నీరాజనాలందిస్తూ నిర్వహించిన అపురూప పురస్కారాల ప్రదానోత్సవ వేడుక ప్రతి ఒక్కరికీ చక్కని అనుభూతిని మిగిల్చింది. ఇక ఇప్పుడు 'ఒకరికి ఒకరు' ముచ్చటగా మూడవ సంవత్సర వైభవానికి ముస్తాబైంది.
తెలుగు బుల్లితెర వయసు 20యేళ్ళు పూర్తయిన శుభ సందర్భంగా ఈ ప్రయాణంలోని ఆణిముత్యాలైన 12 జంటలను 'ఒకరికి ఒకరు' వేదిక పై అంగరంగ వైభవంగా సత్కరించింది జీ తెలుగు. దూర దర్శన్ లో ప్రసారమైన సంచలన ధారావాహిక 'ఋతురాగాలు' లోని జంట ప్రీతి నిగం, నగేశ్ కర్రా, అందం ధారావాహిక లో అలరించిన భావన, రాజా రవీంద్ర తదితరులు జ్ఞాపికలందుకున్న వారిలో ఉన్నారు.
ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ, అలనాటి బుల్లితెర వెలుగులు అశోక్ రావు, అశోక్ కుమార్, 'ప్యార్ మే పడిపోయానే' చిత్ర నాయికా నాయికలు ఆది, శాన్వి, తదితరులంతా తరలి వచ్చిన ఈ 'ఒకరికి ఒకరు' కార్యక్రమ వేదిక ఆనందాల వేడుకగా సాగింది. ముచ్చటైన జంటలుగా జ్ఞాపికలను అందుకున్నవారు తమ ఉత్సాహవంతమైన పెర్ఫార్మెన్సులతో అలరించారు. 'హృదయ కాలేయం' చిత్రంతో సంచలనం సృష్టించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ముద్దుగుమ్మలు ప్రియాంక, నిధి, అంజలిలతో కలిసి వేసిన స్టెప్పులు కార్యక్రమాన్ని ప్రత్యేక ఆకర్షణ కానున్నవి. అనసూయ, ప్రదీప్ ల పసందైన వ్యాఖ్యానం తో అలరించనున్న "ఒకరికొకరు" కార్యక్రమాన్ని మే 25వ తేది, ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్టు జీ తెలుగు ప్రతినిధి వెల్లడించారు.
|