![Gopalam Tondara paddadu Gopalam Tondara paddadu](https://www.gotelugu.com/godata/articles/202311/Madyapaanam-Story picture_1699798406.jpg)
పూజ్య బాపూజీ మద్యపాన విరోధులు అని, మద్యపాన నిషేదానికై ప్రజానీకంలో తగు సామాజిక స్పృహ తేవడానికి చాలా కృషి చేసేరు అని చదువుకున్నాము.
ఆయనని ఆదర్శం తీసుకొని, ఆయనే మాకు దేముడు అంటూ ప్రగల్భాలు పలుకుతూ, ఆయన చిత్రపటం వారి కార్యాలయాల్లో తప్పకుండా పెట్టి పూలదండతో అలంకరిస్తూ, ఆయన విగ్రహం దగ్గర ఘాటైన ఉపన్యాసాలు చేస్తూ మనల్ని ఏలుతున్న రాజకీయనేతలు మాత్రం --
మద్యపానం విరివిగా త్వర త్వరగా అభివృద్ధి అయేందుకు అలుపెరుగని కృషి పోరాటం
చేస్తున్నారు అన్నది జగమెరిగిన సత్యం.
వారి కృషికి పోరాటానికి చలించిన జనం కూడా ఇతోధికంగా సహకారం అందిస్తూ ఆ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు.
ప్రభుత్వాలు ఆ అభివృద్ధిని సాగిస్తూ ప్రభుత్వ ఖజానాకి ఆదాయం పెంచే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయేరు.
ఇందుకు సోదాహరణగా చెప్పుకోవాలంటే ---
-- జనంలో మద్యం అమ్ముకుందుకి ప్రభుత్వం వారు ఇచ్చే ఆమోదానికి నిర్ణయించిన రుసుముతో నిర్దిష్టమైన గడువులో అభ్యర్ధనలు సమర్పించమని ఇటీవల ఒక రాష్ట్రప్రభుత్వం వారు ఇచ్చిన ప్రకటనకు ఉవ్వెత్తుగా స్పందించిన జనం సమర్పించిన రుసుము ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నికర ఆదాయం అక్షరాలా రెండువేల కోట్ల రూపాయల పైనే.
ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వాలు చేసే ప్రయత్నంలో ---
ఎంతమంది జనం అనారోగ్యం పాలవుతున్నారు, ఎన్ని కుటుంబాలు వీధిన పడుతున్నాయి అన్న విషయం ఏ ప్రభుత్వం వారికి చీమ కుట్టినంతగా కూడా పట్టడం లేదు.
చలన చిత్రాల తెరపై, దూరదర్శన్ తెరపై ప్రభుత్వం వారు నిర్ణయించిన ప్రకటన –
‘మద్యం సేవన ఆరోగ్యానికి హానికరం’
-- తప్పనిసరిగా చూపిస్తున్నారు.
ఆ ప్రకటన చూస్తూనే, మద్యం గొంతులోకి పోసుకుంటున్నారు వీక్షకులు.