ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లో ప్రముఖులైన వారి జీవిత చరిత్రలని బయోపిక్స్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. వాటిలో కొన్ని కాంట్రవర్సీలకు వేదిక అవుతుండగా, మరికొన్ని ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. ఈ కోవలో తాజాగా దర్శక రత్న దాసరి నారాయణరావు బయోపిక్ని తెరకెక్కిస్తానంటూ ఓ డైరెక్టర్ ముందుకొచ్చారు. ఆయన ఇంకెవరో కాదు, దర్శక రత్న దాసరికి అత్యంత సన్నిహితుడు, ఆయన ప్రియ శిష్యుల్లోె ఒకరైన ఓ. కళ్యాణ్. ఇటీవలే దాసరి అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈయన మరణంతో సినీ పరిశ్రమ ఓ పెద్ద దిక్కును కోల్పోయిన భావన పొందింది.
సినీ రంగానికి దాసరి చేసిన కృషి అజరామరం. ఆయన బయోపిక్ వస్తుందంటే అందరికీ ఆనందించదగ్గ విషయమే. అయితే సినీ రంగంలో దిగ్గజాలైన దాసరికీ, మెగాస్టార్ చిరంజీవికి మధ్య విబేధాలున్న విషయం విదితమే. ఈ కోణంలో దాసరి బయోపిక్ని తెరకెక్కిస్తే, వీరిరువురి మధ్యా ఉన్న విబేధాలను తెరపై చూపిస్తారా? లేదా అనే విషయంపై చర్చ జరుగుతోంది. మరో పక్క దాసరి కేంద్ర మంత్రిగా పని చేసిన టైంలో బొగ్గు కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ, ఆయనపై వివాదాలు, కోల్ గేట్ స్కాములు ఇతరత్రా విషయాలను సినిమాలో చూపిస్తారా లేదా? అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. ఏది ఏమైనా దాసరి జీవిత చరిత్ర తెరకెక్కితే, ఆయనకు సంబంధించిన నెగిటివ్ విషయాలను టచ్ చేయకుండా, పోజిటివ్ విషయాలను మాత్రమే చూపించి, ఆయన గౌరవాన్ని, ప్రజలకు ఆయనపై ఉన్న అభిమానాన్ని నిలబెట్టాలనీ, దాసరి అభిమానుల అభిప్రాయం.
|