ఈ నెల 6వ తేదీ అనగా బుధవారం అలనాటి మేటి నటి సావిత్రి జయంతి సందర్భంగా, ఆమె జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మహానటి' చిత్ర యూనిట్ అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? 'మహానటి' టైటిల్ లోగో. మామూలుగా విడుదల చేస్తే కిక్కేముంటుంది టైటిల్ని. అందుకే కొంచెం కొత్తగా ఆలోచించింది చిత్ర యూనిట్. ఇందుకోసం ఓ స్పెషల్ వీడియోని డిజైన్ చేసింది. ఈ వీడియోలో ఓ మహిళ పాత కాలం నాటి ఓ పేటికను తెరిచింది.
అందులో నుండి మొదట 'మహానటి' టైటిల్ లోగో బయటికి వచ్చింది. ఆ తర్వాత అలనాటి మేటి నటి సినీ కెరీర్లో ఆమె పలికిన అద్భుతమైన కొన్ని డైలాగులు, పాటలు వినిపించాయి. టైటిల్ లోగో కోసం ప్లాన్ చేసిన ఈ సర్ప్రైజ్ సినీ ప్రియుల్ని భలే ఆకట్టుకుందిలే. ఈ సినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషిస్తోంది. ముద్దుగుమ్మ సమంత ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అది జమున పాత్ర అంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. 'పెళ్లి చూపులు' ఫేం విజయ్ దేవరకొండ, షాలినీ పాండే ప్రకాష్రాజ్, మోహన్ బాబు తదితరులు ఇతర ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మిక్కీ జె.మేయర్ అద్భుతమైన మ్యూజిక్నందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఈ సినిమాని రూపొందిస్తోంది. సావిత్రి సినీ, నిజ జీవితంలోని ఎన్నో ఆశక్తికరమైన అంశాలను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. మార్చి 29న 'మహానటి' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
|