ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకిచ్చిన నంది పురస్కారాల రాద్ధాంతం సంగతి తెలిసిందే. అర్హత కలిగీ కొన్ని సినిమాలు ఈ నంది పురస్కారాన్ని అందుకోలేకపోయాయి. ఈ విషయమై సినీ ఇండస్ట్రీలో పలువురు సినీ ప్రముఖులు గళం విప్పారు. కొన్ని రోజులు వివాదం జరిగింది. తర్వాత సద్దుమనిగిపోయింది. అయితే తాజాగా ఈ విషయంపై నాగార్జున స్పందించారు. 'మనం' సినిమాకి నంది అవార్డు ఇచ్చుంటే నంది గౌరవం నిలబడి ఉండేది. ఇప్పటికీ ఈ విషయాన్ని తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.ఇదే ఉద్దేశ్యంతోనే నాగార్జున ఇంతవరకూ ఈ అవార్డుల విషయంలో స్పందించలేదు. అయితే 'హలో' సినిమా ప్రమోషన్ నిమిత్తం వీటిపై స్పందించాల్సి వచ్చింది నాగార్జునకి. తప్పలేదు. అందుకే సింపుల్గా 'మనం' సినిమాకి అవార్డు అవసరం లేదు అని ముగించేశాడు నాగార్జున.
నిజమే. అలాంటి సినిమాలకు అవార్డులిస్తే ఆ అవార్డు గొప్పతనం మరింత రెట్టింపు అవుతుంది. అవార్డు రాకపోయినా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని ఆదరించారు. అందుకే ప్రభుత్వం అవార్డు ఇవ్వకపోయినా సినిమా గొప్పతనం ఏమాత్రం తగ్గలేదు. అదే అర్ధం నాగార్జున స్పందనలో కూడా అంతర్లీనంగా దాగున్నట్లే అని అర్ధం చేసుకోవాలి. ఇదిలా ఉండగా అక్కినేని అఖిల్ రీ లాంఛింగ్ మూవీ 'హలో' ఈ నెల 22న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఈ సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కళ్యాణీ ప్రియదర్శిని ఈ సినిమాతో టాలీవుడ్కి పరిచయం అవుతోంది.
|