ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు కన్ను మూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 12 మంగళవారం ఉదయం హైద్రాబాద్లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సంపాదకుడిగా విజయబాపినీడు తెలుగు చిత్ర సీమకు చేసిన సేవలు అమోఘమైనవి. శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించి, ఇరవైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ బాపినీడు. ఆయన దర్శత్వం వహించిన సినిమాల్లో ఎక్కువగా చిరంజీవి సినిమాలే ఉండడం విశేషం. చిరంజీవికీ, విజయబాపినీడుకు మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. చిరంజీవిపై ఆయనకున్న ప్రేమను చాటుకునేందుకు చిరంజీవికి ఏనుగును బహుమతిగా ఇచ్చారు ఆ రోజుల్లో విజయబాపినీడు.
దర్శకుడిగా ఆయన తొలి చిత్రం 'మగమహారాజు'. చిరంజీవి హీరోగా రూపొందిన ఈ చిత్రంతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. వీరి కాంబోలో వచ్చిన 'ఖైదీ', గ్యాంగ్లీడర్' చిత్రాలు సంచలన విజయం అందుకున్నాయి. 'బిగ్బాస్' మూవీ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత చిరంజీవితో ఆయన సినిమా చేయలేదు. ఆయన సొంత నిర్మాణంలో చిరుతో సినిమా చేయాలని ప్రయత్నాలు భారీగా జరిగాయి కానీ కుదరలేదు. 'చిరంజీవి' పేరుతో ఆయన ఓ పత్రికనే స్థాపించారు. 'నా మనసుకు అత్యంత దగ్గరైన ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది..' అని సంతాపం వ్యక్తం చేశారు చిరంజీవి. చిరంజీవితో సహా మోహన్బాబు, సూపర్స్టార్ కృష్ణ ఇలా పలువురు హీరోలతోనూ ఆయన పని చేశారు. అలాగే రచయితగా పలు నవలలను కూడా ఆయన రచించారు. విజయబాపినీడు మృతి పట్ల తెలుగు చిత్ర సీమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
|