Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

బుధ్ధపూర్ణిమ సందేశం. - అదూరి.హైమావతి

buddhapoornima samdesam

బుద్ధం సరణం గఛ్చామి –

ధమ్మo సరణం గఛ్చామి-

సంఘo సరణం గఛ్ఛామి-        అంటూ బౌధ్ధుడు మానవజాతికి ధర్మాన్ని బోధించాడు .ధర్మమార్గాన సంఘంలో జీవిస్తూ బుధ్ధుని శరణుకోరితే ఆనంద ప్రాప్తి కలుగుతుంది.

 సమాజంలో వర్ణ  వివక్ష పెరిగి ,మత మౌఢ్యంలో, సాంప్రదాయాలపేర జనావళికి  భగవత్తత్వాన్ని మరుగు పరచి ఆచార వ్యవహారాల పట్ల కఠిన ధోరణి పాటించే రోజుల్లో ఉద్భవించి, మానవాళికి ప్రత్యేకమైన ధర్మ మార్గాన్ని చూపి , కోర్కెల అదుపుతో,అతి సాధారణ జీవన విధానం ద్వారా , సంతృప్తి కరజీవితం , సమ సమానత్వం  సమాజ శ్రేయస్సు సాధించ వచ్చని  బోధించిన మహామహుడే  బుధ్ధుడు. 

బుధ్ధుడు వర్ణవ్యవస్థను నిశితంగా ఖండించాడు. జన్మకాక, గుణం ప్రధాన మని బోధించాడు. ఆత్మ,పరమాత్మ, పునర్జన్మ మొదలైన అర్ధం కాని విషయాలను ఆలోచిస్తూ  జీవితాన్ని వృధాచేసు కోతగదనీ, మానవుని చిత్త సంక్షోభానికి  మూల కారణం ప్రపంచ మంతా ఆవరించిఉన్న దుఃఖ మనీ చెప్పి, దుఃఖానికి కారణం  కోరిక గనుక ఆ కోరికను జయించడం ప్రధమ కర్తవ్యంగా బోధించాడు. నియమ బధ్ధజీవనం, క్రమశిక్షణ, ప్రజా సేవ లాంటివి మానవుని ఉన్నతికి మార్గాలని సూచించాడు .

       శుధ్ధోదన చక్రవర్తి, మాయాదేవి గౌతమ బుధ్ధుని తల్లి దండ్రులు. మాయా దేవికి ఆరు  దంతముల తెల్ల  ఏనుగు తన గర్భములోకి ప్రవేశించి నట్లుగా వచ్చిన ఒక నాటి కలలోని దృశ్యము ఆమె నెంతగానో ఆశ్చర్య పరుస్తుంది..తదుపరి పది నెలలకు కుమారునికి జన్మ నిచ్చింది మాయాదేవి. ఆమె ప్రసవమునకు పుట్టింటికి వెళ్తుండగా మార్గమధ్యమున కపిలవస్తులోని లుంబిని అనే ప్రాంతంలో  ఒక సాలవృక్షం క్రింద మగ బిడ్డను ప్రసవిస్తుంది. ఆ బిడ్డేసిద్ధార్ధుడు . 

   చక్రవర్తి కుమారునిగా రాజభవనంలో జన్మిచ వలసిన బాలుడు మార్గ మధ్య  వనంలో జన్మించటమే అతడు అతి సాధారణ జీవనం గడిపి జనావళికి  ముక్తిమార్గాన్ని బోధించ గల బోధిసత్వుడౌ తాడనే సూచన కావచ్చు . బిడ్డ పుట్టగానే మాయాదేవి మరణిస్తుంది. శుధ్ధోదనుని రెండవ భార్య గౌతమి ఆ బాలుని పెంచి పెద్ద చేస్తుంది.

సిద్ధార్దుడు అనే మాటకు అనుకున్న లక్ష్యాన్నిసాధించే వాడని అర్ధం. తన బిడ్డకు నామకరణం తర్వాత వాని భవుష్యత్  గురించీ జ్యోతిష్కు లనుఅడుగుతాడు శుధ్ధోదనుడు. వారు ఆయనకు సిధ్ధార్ధుడు రాజ్య భోగాలు  త్యజించి సన్యసిస్తాడని చెప్పగా శుద్దోధనుడు, సిద్ధార్దుని తన తర్వాత గొప్పచక్రవర్తిని చేయాలనే ఉద్దేశ్యంతో , కుమారుని సామాన్య ప్రజల కష్టసుఖాలు తెలియకుండా రాజమందిరం లోనే  పెంచసాగాడు .

        సిధ్ధార్ధునికి విద్యాభ్యాసం పూర్తైన తరవాత యుక్త వయస్సు రాగానే యశోధర అనే కన్యతో వివాహం జరుగు తుంది. వారికి రాహులుడనే కుమారుడు జన్మిస్తాడు.

    సిధ్ధార్ధుడు ఒకరోజున రధంపై నగర సందర్శ  నానికి వెళ్ళి ఒక ముసలి వానిని, ఒక రోగిని, ఒక శవాన్నీ  ఒక సన్యాసిని చూస్తాడు .తన రధ సారధి ఐన చెన్నుడ్ని 'వీరంతా ఎవరని ప్రశ్నిస్తాడు. ప్రతి వ్యక్తికీ యవ్వనం తర్వాత ముసలి తనం ,రోగం,మరణం తప్పవని  చెన్నుడి ద్వారా తెల్సు కుని బాధపడి ' సన్యాసి అంత ఆనందంగా ఉండటానికి కారణం అతడు సర్వం త్యజించటమే అని తెల్సుకుని,తాను ఈ బంధాలన్నింటి నుండీ విముక్తి పొంది ఆ సన్యాసిలా ఆనందంగా జీవించాలనే సంకల్పం తో సన్యాస జీవితం గడప నిశ్చయించాడు.  

      ఒక రాత్రి భార్యాబిడ్డలను, ఇంటిని వదలి రాజ భవనంనుండీ బయట పడి ,సన్యాసం స్వీకరించి, యోగ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసిం చాడు. తర్వాత సిద్ధార్దుడు ,ఐహిక సుఖాలను ,కోరికలను పూర్తిగా త్యజిం చి , ఆహారం సైతం మాని ధ్యానంతో ఉండి పూర్తిగా శక్తి హీనుడై నీర సించిన సమయంలో సుజాత అనే పల్లె పడుచు  కొంత అన్న పాయ సాన్ని తెచ్చి ఇవ్వగా దాన్ని భుజించిన, సిధ్ధార్ధునికి , ఆహారాన్ని త్యజించి శరీరాన్ని కృశింప జేయటం వలన ఉపయోగం లేదని గమ నించి కొద్దిగా ఆహారం తీసుకుంటూ బుద్ధ గయలో ఒక బోధివృక్షం నీడలో ధ్యానం చేస్తూ పరమ సత్యం తెలుసుకున్నాడు .

       35వ యేట సిద్ధార్దునకు జ్ఞానోదయ మయ్యింది. అప్పటి నుండి సిద్ధార్దుడు, గౌతమ బుద్ధునిగా మారాడు. బౌద్ధమతంలో ఇతనిని శాక్యముని అని అంటారు..

      జ్ఞానోదయమయ్యాక,  గౌతమ బుద్ధుడు, మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను,వా టి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకో గలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు.        సంస్కృతంలో  కాక జనులందరికీ తెల్సిన పాళీ భాషలో బోధించే వాడు. దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవులకు , తను తెలుసుకున్న ధర్మాన్ని బోధిస్తూ పర్యటన సాగించాడు. బుద్ధుడు ఉత్తర భారతదేశంలో ఉన్న కాశీపుణ్య క్షేత్రంలోని  లేళ్ళ  ఉద్యానవనం లో తొలుతగా ఐదుగురు సన్యాసులకు, తను తెలుసుకున్న పరమ సత్యంపై మొదటి ఉపన్యాసం ఇచ్చాడు.

 వీరంతా బుద్ధునితో కలిసి మొదటి బౌద్ధ భిక్షువుల సంఘాన్ని ఏర్పరి చారు. ఈ విధంగా బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది .క్రమేపీ శిష్యులు చేరగా వీరంతా  బుద్ధుని బోధనలను, సామాన్య ప్రజలకు బోధించడానికి ప్రపంచ మంతా పర్యటించారు.

 

    సామాన్య ప్రజల నుండీ  గొప్పతత్వ వేత్తల వరకూ, వీధుల ను శుభ్రం చేసే అంటరాని వారి నుండీ అంగుళీ మాలుని లాంటి హంతకులనూ, అళవక వంటి నర మాంస భక్షకులనూ తన బోధలతో మంచి వారుగా మార్చాడు.  బౌద్ధ మతంలో అన్ని జాతులు తెగలకు చెందిన ప్రజలు చేరడానికి వీలుండడం మరియు కుల, వర్గ బేధం లేక పోవడంతో బౌద్ధ మతం లోకి వేల కొద్దీ ప్రజలు రాసాగారు..

 

  జీవహింసతో కూడిన యఙ్ఞయాగాలకు వ్యతిరేకంగా, మత, కుల వర్ణ విచక్షణలేని బౌధ్దమతం  క్రమేపీ  అంతటా వ్యాపించింది. బుధ్ధుని సోదరులు, కుమారుడు, భార్య సైతం బౌధ్ధ భిక్షువులవు తారు.

     బుధ్ధుడు 80వ ఏట  కాశీనగరం వద్దగల హిరణ్యవతీ నదీ తీరంలోని సాలవృక్ష క్రింద శరీరాని వీడాడు.,బుధ్ధుడు జన్మించినది , ఙ్ఞానోదయ మైనది, పరినిర్యాణము[ శరీరాన్నివీడటం క్రీ..పూ.445లో ] వైశాఖ పూర్ణిమ రోజునే జరిగటం చిత్రం! అందుకే బౌధ్ధులకు ఈ రోజు మహా పర్వదినం.

బుధ్ధుడు ఆఖరి ఘడియల్లో తన శిష్యుడైన ,ఆనందునితో ఈవిధంగా చెప్తాడు .

    ”మానవుడు తాను ప్రేమించిన వస్తువును వీడి పోవలసినదే, లోకంలో పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు  ,నేను భౌతికంగా లేనంత మాత్రాన నేను లేనను కోకు,నా సిధ్ధాంతమే  మీకు ఇహ మీద ఆచార్యుడు."

బుధ్ధుడు ఇలా బోధించాడు...సర్వం దఃఖమయం ,సర్వం క్షణికం,  సర్వం అనాత్మ,నిర్వాణమే శాంతం. నిర్వాణము అంటే మరణించటం కాదు .ప్రతి మనిషీ చెడును వదలి మంచి గుణాలు సాధించి నపుడు., ఆశాపాశముల నుండీ విముక్తి లభిస్తుంది. జీవితం బాధామయం ,కొరికలే బాధకు మూలం, వాటినిని యంత్రించిన బాధఉండదు. దీనికై అష్టాంగమార్గమును అనుసరించాలి.

          బౌద్ధమతంలో నాలుగు పరమసత్యాలు ప్రవచింప బడ్డాయి. దుఃఖము ,దుఃఖానికి కారణము , దుఃఖం నుండి విముక్తి , దాన్నుండీ ముక్తిని పొందే మార్గం . -ధర్మ చక్రం లోని 8 ఆకులు అష్టాంగ మార్గానికి ప్రతీకలు

అష్టాంగ మార్గసాధనకు- అహింస, సత్యము, అస్తేజము, బ్రహ్మచర్యము, మద్యపానము చేయ కుండుట, వీటిని పాటించి సంఘంలో సద్గుణ సంపన్నులైన  మావవులే ఉoడి దుర్మార్గము,మోసము,పాపము లేని స్వఛ్ఛమైన  సమాజ స్థాపన జరిగి, సర్వులూ సుఖ సంతోషాలతో విరాజి ల్లుతారని బుధ్ధుని మతం, అది సర్వే సత్వత్రా ఆచరణీయం. బుధ్ధం శరణం గఛ్ఛామి .

                              ***

 

మరిన్ని శీర్షికలు
Chinta Chiguru - Chicken