కొత్త డైరెక్టర్లు.. కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఆ ఆలోచనలు ఒక్కోసారి మంచి విజయాలు అందిస్తున్నాయి. కొన్నిసార్లు ఆచరణా లోపం వల్ల పరాజయాలుగా మిగులుతున్నాయి. మొన్న విడుదలైన 'సవ్యసాచి' సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ఇంతవరకూ ట్విన్స్ అంటే డబుల్ రోల్స్ మాత్రమే చూశాం. కానీ ఒకే బాడీలో ఇద్దరు అనే కాన్సెప్ట్ 'సవ్యసాచి'తో కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఇంచుమించు ఇదే కాన్సెప్ట్తో వస్తున్న మరో విభిన్న చిత్రం 'బుర్రకథ'. అయితే ఈ సినిమాలో హీరోకి రెండు మెదళ్లు ఉంటాయి. దాంతో రెండు డిఫరెంట్ వేరియేషన్స్లో ప్రవర్తిస్తుంటాడట హీరో.
ఇది కూడా సవ్యసాచిలాగేనండీ. అందులో 'విక్రమ్', 'ఆదిత్య' అనే ఇద్దరు ఒకే బాడీలో ఉంటారు. అయితే ఆదిత్య విక్రమ్ ఎడమచేతిలో ఉంటాడు. ఇక్కడ 'బుర్రకథ' విషయానికొస్తే, 'అభి', 'రామ్' కలిసి ఒకే బాడీలో ఉంటారు. కానీ వీరి మెదళ్లు వేర్వేరుగా ఉంటాయి. క్యారెక్టర్స్ పరంగా అభి, రామ్ ఇద్దరూ పూర్తిగా డిఫరెంట్. ఒక మామూలు అబ్బాయి ఎలా ఉండాలనుకుంటారో వాడే రామ్, ఒక అబ్బాయి ఎలా ఉండకూడదని కోరుకుంటారో వాడే అభి. ఇలా రెండు డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న ఇద్దర్ని ఒకే బాడీలో అమర్చి డైరెక్టర్ చేయబోతున్న మ్యాజిక్ ఏంటో తెలియాలంటే 'బుర్రకథ' సినిమా చూడాల్సిందే. ప్రముఖ రచయితగా పాపులర్ అయిన డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంతకీ 'అభి', 'రామ్' అంటూ రెండు క్యారెక్టర్స్లో కనిపించబోతున్న మన హీరోగారి పేరు చెప్పలేదు కదా.. యంగ్ హీరో ఆది సాయికుమార్. 'సవ్యసాచి' రిజల్ట్ తర్వాత, 'బుర్రకథ' గురించి వింటే రిస్కీ అన్పించడం ఖాయం. మరి, రిస్క్ చేస్తున్న ఆది హిట్టు కొడతాడా? వేచి చూడాల్సిందే.
|