తెలుగు సినీ పరిశ్రమలో శ్రీహరి స్థానం ప్రత్యేకం. ఆయన మరణం తర్వాత ఎంతో మంది గొప్ప నటులు తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి ఉండొచ్చు గాక. కానీ శ్రీహరి లేని లోటును ఎవ్వరితోనూ పోల్చడం సాధ్యం కాదు. శ్రీహరి కోసం, ప్రత్యేకంగా పాత్రల్ని రాసుకునేవారు కథా రచయితలు. అలాంటి పాత్రల్ని ఇప్పుడు రాయడం మానేసుకున్నారు. ఓ నటుడి గొప్పతనం గురించి ఇంతకన్నా గొప్పగా ఎలా చెప్పగలం.? విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శ్రీహరి పోషించిన పాత్రలు దేనికవే ప్రత్యేకం. ఇప్పుడాయన తనయుడు మేఘాంష్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. 'రాజ్దూత్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మేఘాంష్ హీరోగా తొలి సినిమాతోనే గొప్ప విజయాన్ని అందుకోవాలని మొత్తం సినీ పరిశ్రమ ఆశిస్తోంది. చాలా అరుదుగా ఇలాంటి ఆశీస్సులు వారసులకు లభిస్తుంటాయి. ఆ విషయంలో మేఘాంష్ అదృష్టవంతుడే. సినిమా ప్రోమో ఇప్పటికే విడుదలైంది.
ఓ బైక్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. తొలి సినిమానే అయినా ఎలాంటి బెరుకూ లేకుండా నటించినట్లున్నాడు మేఘాంష్. ఒక్క ప్రోమోతో మేఘాంష్ నటనా ప్రతిభపై ఓ అవగాహనకొచ్చేయలేం. కానీ ప్రోమో చూస్తుంటే, ప్రామిసింగ్ హీరో అయ్యే లక్షణాలున్నాయని మేఘాంష్ గురించి ఖచ్చితంగా చెప్పొచ్చు. అర్జున్ - కార్తీక్ ద్వయం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో 'రాజ్దూత్' ప్రేక్షకుల ముందుకు రానుంది.
|