తెలుగు సినిమా చరిత్రలో మరో కొత్త పేజీ మొదలయ్యే తరుణం ఆసన్నమైంది. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు సినిమా చరిత్రని తిరగ రాస్తుందని నిరూపించింది. సురేందర్ రెడ్డి టేకింగ్, మెగాస్టార్ చిరంజీవి అప్పియరెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రామ్ చరణ్ నిర్మాణ విలువలు, విజువల్ ఎఫెక్ట్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ట్రైలర్ స్టార్ట్ అయిన దగ్గర నుండీ, ఎండింగ్ వరకూ ఓ లెవల్ మెయింటైన్ అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలం నాటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్లిపోయేలా చేసింది ట్రైలర్. ఎప్పుడు స్టార్ట్ అయ్యిందీ, ఎప్పుడు ఎండ్ అయ్యిందో కూడా తెలియనట్లుగా ట్రైలర్ పూర్తయిపోయింది. దాదాపు 3 నిముషాల ట్రైలర్లో మొత్తం మూడు గంటల సినిమా చూపించేసిన ఫీల్ క్రియేట్ చేశారు.
దేశభక్తిని పురిగొల్పేలా డైలాగులు, యాక్షన్ ఘట్టాలూ నో డౌట్ 'న భూతో న భవిష్యతి' అనేలా ఉన్నాయి. 'ఈ భూమ్మీద పుట్టాం.. ఈ మట్టిలోనే కలిసిపోతాం.. నీకెందుకు కట్టాలిరా శిస్తు..' అని నరసింహారెడ్డి ఆంగ్లేయున్ని అడిగిన వైనం నుండి, చివరిలో నీ చివరి కోరిక ఏంటని కోర్టు సాక్షిగా ఆంగ్లేయుడు ఇంగ్లీష్లో అడిగిన ప్రశ్నకు 'గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్' అని నరసింహారెడ్డి చెప్పే డైలాగ్తో ట్రైలర్ పూర్తయిపోతుంది. నరసింహారెడ్డి సాధారణ వ్యక్తి కాదు.. కారణ జన్ముడు అనే డైలాగులు పరుచూరి బ్రదర్స్ అనుభవానికి గుర్తులు. హీరోయిన్లుగా నటించిన నయనతార, తమన్నా పాత్రలు పోటా పోటీగా ఉన్నాయి. బిగ్బీ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, నిహారిక తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న 'సైరా' ప్రేక్షకుల ముందుకు రానుంది.
|