ఈటీవీ ఛానెల్లో గత కొన్నేళ్లుగా ప్రసారమవుతూ, మిక్కిలి ప్రజాదరణ పొందిన నవ్వుల ప్రోగ్రామ్గా పాపులర్ అయ్యింది జబర్దస్త్ షో. అలాంటి నవ్వుల ప్రోగ్రామ్ త్వరలో కళ తప్పిపోనుందా.? అంటే అవుననే అంటున్నాయి బుల్లితెర వర్గాలు. ఈ నవ్వుల ప్రోగ్రామ్కి సెంటరాఫ్ అట్రాక్షన్ నవ్వుల బాబు నాగబాబు, రోజా. గత కొన్నాళ్లుగా నాగబాబు ఈ షోకి గుడ్ బై చెప్పేస్తారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ 'జబర్దస్త్' షోని విడిచిపెట్టనని నాగబాబు పలుమార్లు చెప్పారు. అయితే, నాగబాబు ఈ షో నుండి తప్పుకోక తప్పలేదని తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. ఈ షోకి డైరెక్టర్స్ అయిన నితిన్, భరత్లకూ, షో నిర్మాతలైన మల్లెమాల వారికి మధ్య చిన్న చిన్న డిఫరెన్సెస్ రావడంతో వారు ఈ షో నుండి తప్పుకున్నారు.
అయితే, ఆ డిఫరెన్సెస్ కాస్తా ఇప్పుడు నాగబాబు వరకూ రావడంతో, నిర్మాతల ధోరణి నాగబాబుకు కూడా నచ్చకపోవడంతో ఈ షోని వదలుకోక తప్పలేదట. అంతేకాదు, నాగబాబుతో పాటు, సుధీర్, గెటప్ శీను, చంద్ర తదితరులు కూడా ఈ షో నుండి తప్పుకోనున్నారట. అలాగే రోజా కూడా కొన్ని పొలిటికల్ రీజన్స్తో జబర్దస్త్కి బైబై చెప్పాల్సి వస్తోందట. జబర్దస్త్కి మూల స్థంభాలైన నాగబాబు, రోజా లేకుంటే, ఈ షోని ఊహించడం కష్టం. వారి ప్లేసెస్ని భర్తీ చేయడం మరొకరికి సాధ్యం కాదు. ఈ షోని రీప్లేస్ చేయాలనే ఉద్దేశ్యంతో చాలానే నవ్వుల ప్రోగ్రాములు వచ్చాయి కానీ, అవేమీ 'జబర్దస్త్' ముందు నిలవలేకపోయాయంటేనే, ఈ షోకి నాగబాబు, రోజా అప్పియరెన్స్ ఎంత ముఖ్యమో అర్ధం చేసుకోవచ్చు. అలాంటిది వీరిద్దరి జడ్జిమెంట్ లేకుండా 'జబర్దస్త్' రన్ చేయడం సాధ్యమేనా.? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే నాగబాబు లేకుండా కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఇంత రచ్చ జరుగుతున్నా, నాగబాబు ఈ విషయంలో స్పందించకపోవడంతో, గతంలో రూమర్స్ వచ్చినట్లే, ఇది కూడా జస్ట్ రూమరేనా.? అనేది తెలియాల్సి ఉంది.
|