ఆశు కవి శిఖామణులు - ambadipudi syamasundar rao

ఆశు కవి శిఖామణులు
తెలుగు సాహిత్యములో జంట కవులుగా పేరు పొందిన వారు తిరుపతి వంకట కవులు, అలాగే కొప్పరపు కవులు. కొప్పరపు సోదరులు అయిన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, కొప్పరపు వేంకట రమణ కవి ఇద్దరు తెలుగు సాహిత్య అవధానంలో,మరియు ఆశుకవిత లో ప్రసిద్ధిచెందిన జంట,తెలుగు నాట ప్రఖ్యాతి చెందిన సోదర కవులు ఈ సోదరులిరువురు పదహారేళ్ళు నిండకనే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా పేరుపొందారు.తెలుగు భాషకే ప్రత్యేకమైన అవధానాలు సమర్ధవంతముగా చేసేవారు నేడు కరువైనారు అవధానాల్లో ప్రశ్నలు అడిగే పృచ్ఛకులు కూడా కరువైనాఋ ఇది నేటి పరిస్థితి. వీరు ప్రకాశం జిల్లా అడ్డంకి తాలూకా కొప్పరము గ్రామంలో వేంకటరాయలు, సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. వీరిలో పెద్దవాడు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (జ. నవంబరు 12,1885 - మార్చి 29, 1932), రెండవ వాడు కొప్పరపు వేంకటరమణ కవి (జ. డిసెంబరు 30, 1887 - మార్చి 21, 1942). వీరి గురువులు రామడుగు కృష్ణశాస్త్రి, పోతరాజు రామకవి.
ఈ జంట కవులు ఆశు కవిత్వముతో పాటు , అష్టావధానాలు,శతావధానాలు చేశారు. ఒకే రోజున రెండు శతావధానాలు చేసిన ఘనత వీరిది 17 సీస పద్యాలూ,మిగిలిన వృత్తాలతో పాటు ఆశువుగా చెప్పి సభా సమాప్తములో వంద పద్యాలు ఆశువుగా వల్లించారట. ఒక సాహితీ సభలో కొప్పరపు సోదరులు గంటకు 400 పద్యాలు అంటే నిముషానికి 8 పద్యాలు అవలీలగా చెప్పారట.చిలకమర్తి లక్ష్మి నరసింహము గారు అధ్యక్షత వహించిన ఒక సాహితీ సభలో ఈ సోదరులు మూడు గంటల్లో 400 పద్యాలు సదస్యులు కోరినట్లుగా చెప్పి పండితులు ఉన్న సభను రంజింపచేశారు. ఈ పద్యాలనూ నాతో వేగముగా చెప్పినప్పటికీ ఏంటో రమణీయముగాను, సుందరముగాను ఉండటం వీరి ఆశుకవితా విధానములో ప్రత్యేకత అని సాహితి ప్రముఖులు మెచ్చుకునేవారు. తప్పొప్పులును కనుక్కోవటానికి అవకాశము ఇవ్వకుండా వేగముగా ఆశుకవిత్వాన్ని చెప్పడము చాలా గొప్ప ప్రతిభ అని తిరుపతి వెంకట కవులు ఆక్షేపించేవారట. కొప్పరపు సోదర కవులు 1908 మొదలుకొని అసంఖ్యాకంగా అష్టావధానాలు చేసి "కవిత పుట్టిల్లు సోదర కవుల యిల్లు" అనే ఖ్యాతిపొందారు.
వీరు అనేక చొట్ల 150 సభలలో అష్టావధాన, శతావధాన, ఆశుకవితా ప్రదర్శనలిచ్చారు వీరి మొదటి ఆశుకవిత్వ సభ అల్వాలు లష్కరులో ఆదిరాజు తిరుమలరావు వీరికి ముంగాలి అందెను బహూకరించాడు. వీరు చెన్నపురి, బాపట్ల, చీరాల, గుంటూరు, పంగిడిగూడెం, హైదరాబాదు లలో చేసిన శతావధానాలు ప్రఖ్యాతమైనవి మార్టేరు సభలో పందెం వేసి గంటకు 720 పద్యాల లెక్కన అర గంటలో మనుచరిత్రను ఆశువుగా చెప్పినట్లు తెలుసున్నది.వీరు ప్రబంధ శైలిలో గంటకు 500 పద్యాలు చెప్పేవారు. వీరికి బాల సరస్వతి, ఆశు కవీంద్ర సింహ, విజయ ఘంటికా, ఆశుకవి చక్రవర్తి, కుండినకవి హంస, కవిరత్న, అవధాన పంచానన, కథాశుకవీశ్వర, ఆశుకవి శిఖామణి మొదలైన బిరుదులు ఉన్నాయి.వేదము వేంకటరాయ శాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, వావిలికొలను సుబ్బారావు, వసురాయ కవీంద్రుడు, కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రులు, కాళ్లకూరి నారాయణరావు, జయంతి రామయ్య పంతులు మొదలైన అనేక ప్రసిద్ధాంధ్ర సంస్కృత పండితులు కొప్పరపు సోదర కవుల అవధాన కవితా సరస్వతిని తిలకించి హారతిపట్టారు.కొప్పరపు సోదర కవుల పూర్వ వంశీయులలో కామరాజ కవి జాంబవతీ పరిణయమును, వేంకటరత్న కవి శాంభవీ శతకం, రామ దండకం లను రచించారు.
వీరిలో పెద్దవాడైన వేంకట సుబ్బరాయశర్మ మార్చ్ 29,1932 న అంటే 42 ఏళ్ల వయస్సుకే మరణించారు. అయన మరణం తర్వాత వేంకటరమణ కవి తమ అనుంగు సోదరుడైన కొప్పరపు బుచ్చిరామ కవి (డిసెంబరు 9, 1892 - మే 29, 1956) తో కలిసి ఆశుకవితా సభలు చేశాడు వెంకట రమణ కవి మార్చ్ 21 న 1942 లో సాహితి లోకము నుండి నిష్క్రమించారు. వీరు అవధానాలలో కొన్ని లక్షల పద్యాలు చెప్పారు. వేంకట సుబ్బరాయకవి గారి కుమారుడు కొప్పరపు సీతారామ ప్రసాదరావు అవధానాశు కవితా ప్రదర్శనలిచ్చి ప్రసిద్ధిచెందాడు. వేంకటరమణకవి కుమారుడు మల్లికార్జునరావు, సీతారామ ప్రసాదరావుతో కలిసి సభలలో పాల్గొని అల్పవయస్సులోనే మరణించాడు వీరి మద్రాసు, గుంటూరు సభల గురించి చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాదు, కాకినాడ సభల గురించి చేగంటి బాపిరాజు సేకరించి 1911 ప్రాంతంలో ప్రచురించారు. వీరి ఈ రెండు సంకలనములను మరికొన్ని అవధానాశు కవితా పద్యాలను కలిపి కుంటముక్కల జానకీరామశర్మ 1963 సంవత్సరంలో "కొప్పరపు కవుల యశోడిండిమ" అనే పేరుతో రెండు సంపుటాలుగా మకర సంక్రాంతి పర్వదినాన ప్రచురించాడు. వీరి జీవితచరిత్రను నిడదవోలు వెంకటరావు 1973 సంవత్సరంలో రచించాడు.
మహాపండితులైన వీరి జ్ఞాపకార్థం "శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము" పేరుతో సెప్టెంబరు 9, 2002 సంవత్సరంలో వీరి దౌహిత్రుడు మాచవరం వేంకట చెంచు రామ మారుతి సుబ్బరాయశర్మ (మా. శర్మ) విశాఖపట్టణంలో స్థాపించాడు ఈ సంస్థ ద్వారా 2003 సంవత్సరంలో "కొప్పరపు సోదర కవులు", 2004 సంవత్సరంలో "కొప్పరపు సోదర కవుల కవిత్వము" అనే గ్రంథాలను డా. గుండవరపు లక్ష్మీనారాయణ ప్రచురించాడు తిరుపతి వెంకట కవుల మాదిరిగా ఈ జంట కవులకు రావాల్సినంత కీర్తి ప్రతిష్టలు రాలేదని చాలా మంది సాహితి వేత్తల అభిప్రాయము. కారణము ఏమిటి అంటే వీరు శిష్యులను ఎక్కువగా తయారు చేసుకోలేదు, పెద్దగా గ్రంధాలను ప్రచురించలేదు.
అంబడిపూడి శ్యామసుందర్ రావు.