ఆత్మోపనిషత్తు - సి.హెచ్.ప్రతాప్

Aఆtmopanishattu

ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో పది మాత్రమే ప్రధానమైనవి.అన్ని ఉపనిషత్తులలోకెల్లా అత్యంత నిఘూఢమైనట్టిది, అత్యంత రహస్యమైనది, పండితులకు సైతం సులభంగా అర్ధం కానిది అయిన ఆత్మోపనిషత్తు ఉపనిషత్తులకు మకుటం లేని మహరాజు అంతే అతిశయోక్తి కాదు. సంవత్సరాల కఠోర సాధన చెస్తే గాని ఈ ఉపనిషత్తు లోని సారాంశం అర్ధం అవదన్నది లక్షలాది పండితుల నిశ్చితాభిప్రాయం. అథర్వణ వేదం లోని ఒక ముఖ్య భాగం అయిన ఆత్మోపనిషత్తు లో భగవంతుని మూడు రూపాల (బాహ్యాత్మ, అంతరాత్మ, పరమాత్మ)ను విపులంగా వివరించింది. పుట్టుట, గిట్టుట అనే ధర్మాలతో కూడిన మానవ ప్రాణిని బాహ్యాత్మగా పార్కొంది. రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, కామమోహాలతో కూడిన అనేక అనుభవాలతో వున్న మానవులలో అంతర్గతంగా ఉన్న ఆత్మ ను అంతరాత్మ గా చెప్పబడింది. ఇక అన్ని ప్రాణుల పుట్టుకకు మూలమైన వాడు, ఈ జగత్తు అంతటికి ఆధారభూతుడు అయిన భగవంతుడిని పరమాత్మ అంటే ఉపాసింపదగినవాడు అని పేకొంది.ఆత్మను తెలుసుకోవడానికి దేశం, కాలం, బుద్ధి ఇవేవీ ఉపకరించవు. బ్రహ్మవేత్తయైనవాడు అనుబంధంతో తాను బ్రహ్మమును అని తెలుసుకొంటున్నాడు. అదియే ఆత్మసాక్షాత్కారం అని చెప్పబడుతోంది.
నిష్కలే నిష్కృయే శాంతే నిరవద్యే నిరంజనే అద్వితీయే పరతత్వే అని పరతత్వం గురించి ఆత్మోపనిషత్తు అద్భుతంగా బోధించింది. అంటే ప్రకాశైక స్వరూపుడు, జనన మరణ చక్రభ్రమణముల కతీతులు, నిత్య ప్రకాశకులు, విశుద్ధ విజ్ఞన స్వరూపుడు, పరమ పవిత్రుడు,సర్వ జీవుల హృదయములయందు సదా ప్రకాశించువారు, నిరామయుడు, ఆనంద సాగరుడు, క్రియా రహితుడు, కాలాతీతుడు,నిర్గుణ నిరాకార పరబ్రహ్మం,సత్య జ్ఞాన సాగరుడు, సృష్టికే ఆధారభూతుడు,త్రిగుణాతీతుడు,పరిశుద్ధ పరమేశ్వర అవతారం ,స్వప్రకాశకుడు, కాలాతీతుడు, సర్వ వ్యాపకుడు, అనంత విశ్వమంతా వ్యాపించి వున్న సత్య జ్ఞాన సాగరుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, నిర్మలుడు, వాగాతీతుడు, అమృత స్వరూపుడు, శాశ్వత ఆత్మ స్వరూపుడు, అద్వితీయం, నిష్కలం,నిష్కృయం, శాంతము, నిరవద్యం,నిరంజనం అయినదే ఆ పరబ్రహ్మ అని అద్భుతమైన వర్ణన ఇచ్చింది. ఈ వర్ణనకు కలియుగ సద్గురువు శ్రీ సాయి ఒక ఉదాహరణ ఇచ్చారు. స్వయం గా ఒక సందర్భం లో ఒక భక్తునితో “ నేను పుట్టినప్పుడు కొడుకు పుట్టానని మా అమ్మ ఎంతో పొంగిపోయింది. ఆది చూసి ఆమె నన్ను కన్నది ఎప్పుడు ? ఆమె కన్న ముందు నేను లేనా ? అందుకు ఆమె ఎందుకంత ఆనంద పడుతోందో నాకు అర్ధం కాలేదు అని ఆశ్చర్యపోయాను” అని అన్నారు. దీనిని బట్టి శ్రీ శిరిడీ సాయినాధులు అయోనిజ సంభవులని, జనన మరణములకు అతీతమైన ఆత్మ స్వరూపమని అర్ధమౌతోంది కదా ! అందుకే శ్రీ సాయి వివిధ భక్తులకు వారు కోరిన రూపాలలో దర్శనం ఇచ్చి ఎన్నో సందర్భలలో తన సర్వజ్ఞతను చాటారు. నేనే ఈ సంసారానికి మూల కారణం .ఈ సృష్టి నా వల్లనే ప్రారంభింపబడినది .నేనే ప్రపంచాన్ని ఉత్తేజితం చేస్తాను. నాయందు శ్రద్ధగా ప్రేమగా ఉండే భక్తుడు మనసు నా యందు నిలపగలిగిన వానికి మనసుని బుద్ధిని నిలిపే వానికి నా యొక్క తత్వం తెలుస్తుంది. మనసు అంటే నమ్మకం. బుద్ధి అంటే తెలుసుకోవడం. మనసు ద్వారా నమ్మి బుద్ధి ద్వారా తెలుసుకున్నవాడు భగవానునికి చేరువ అవగలడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడిను నిమిత్తం చేసుకొని మానవాళికి చెప్పాడు. ఇక్కడ నేనే అంటే ఆత్మస్వరూపమైన పరమాత్మ అని అర్ధం. ఈ భావనయే ఆత్మోపనిషత్తు స్పష్టం చేస్తోంది. ఆత్మజ్ఞానం” అంటే ఆత్మ గురించి జ్ఞానం అంటే, మన గురించి మనం తెలుసుకోవడం. నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మను కూడా అని తెలుసుకోవడం అట్లే నేను మూల చైతన్యం అని తెలుసుకోవటం. ఇటువంటి జ్ఞానం ఆత్మోపనిషత్తులో పుష్కలంగా లభిస్తుంది.

 

ఆయా సాధకుల ప్రయత్న తీవ్రతను బట్టి గురువు మీద, పరమాత్మ మీద ఉన్న శ్రద్ధ వల్ల చివరకు ‘ఆత్మజ్ఞానం’ కలుగుతుంది. అలా, పరమాత్మను తెలుసుకొని ఆయనలో లీనమవడమే మానవజన్మ యొక్క పరమార్థం. పునరావృతి రహితంగా, శాశ్వతంగా ఆయన చరణాల వద్దకు చేరడమే మానవజన్మ లక్ష్యం.