వరలక్ష్మీ వ్రతం - .

varalaxmi vratham

ఈ శ్రావణ మాసం లో వచ్చే 'వరలక్ష్మీ వ్రతం' స్త్రీలందరికీ ప్రీతి పాత్రమైనది. శ్రావణ శుద్ధ పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం 'ఆగస్ట్ 16' న వచ్చింది. ఈ మాసం లో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే లక్ష్మీ దేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు, పసుపు కుంకుమలు, ఐశ్వర్యం ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం.

శ్రవణా నక్షత్రం శ్రీహరి పుట్టిన నక్షత్రం. శ్రావణ మాసం శ్రీహరికి ఇష్టమైన మాసం. కాబట్టి ఆ జగన్మాతకు ప్రీతి పాత్రమైనది. లక్ష్మీ దేవి ఐశ్వర్య దేవత. లక్ష్మీ దేవిని  ఎనిమిది రూపాలలో(ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్య లక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయ లక్ష్మి, విద్యా లక్ష్మి మరియు ధన లక్ష్మి)  అష్ట లక్ష్మిలుగా కొలుస్తాము. ఈ శ్రావణ మాసంలో  వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు(ధాన్యం, ధైర్యం, సంతానం, శక్తి, విద్య, ధనం,మేధస్సు, విజయం) చేకూరుతాయని మహాశివుడు, పార్వతీ దేవికి తెలియచేశాడు.

ఈ వ్రతానికి కొద్దోగొప్పో 'బంగారం' కొంటారు. ఈ వ్రతం రోజున ఇరుగు, పొరుగు స్త్రీలను ఇంటికి పిలిచి శనగలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, రవికల గుడ్డ మొదలగునవి 'వాయినం' గా ఇస్తారు. "ఇస్తి నమ్మ వాయనం". "పుచ్చుకుంటి నమ్మ వాయనం" అనుకుంటారు. ఇచ్చి పుచ్చుకోవటం తో మర్యాదగుణం తో బాటూ ఈ హడావిడి జీవితం లో కాస్త స్నేహభావం వెల్లి విరుస్తుంది.

ఇంటికి వచ్చిన పుణ్యస్త్రీకి కాళ్ళకు పసుపు రాసి, గంధం, బొట్టు పెడతారు. ఈ వర్షాకాలంలో కాళ్ళకి పసుపు రాయటం మంచిది. సైన్స్ ప్రకారం పసుపు 'ఆంటీ బయోటిక్' కూడా!