నా జ్ఞాపకాల్లోంచి .. - డా.కె.ఎల్ .వి.ప్రసాద్

ఆమె ఎవరో … !!

లోకంలో,ఆడవాళ్లు చెప్పిందే సమాజం నమ్ముతుంది .. అంటారు. ఆడవాళ్ళ మాటకే విలువ ఇస్తారు ఎవరైనా .. అని పదిమందీ అనుకునే మాటలో వాస్తవం లేకపోలేదు. అలాగని ఆడవాళ్లు అందరూ వాస్తవాలే మాట్లాడతారనే  గ్యారంటీ కూడా ఎక్కడా కనపడదు. అలాగని ఆడవాళ్లు చెప్పింది నమ్మకుండా ఉండగలమా ?అంటే ,ఉండలేము .. అనే సమాధానం కూడా వస్తుంది.

ఈ ఆలోచనలో కూడా తప్పులేదు. మరి ఎందుకు ఈ అంశాలలో స్త్రీ ఇలా చూడబడుతుందీ ? తరతరాలుగా, స్త్రీని పురుషుడు బానిసగానే చూస్తూ వచ్చాడు. ఆమె అంటే అతనికి విలువ ఉండేది కాదు. మహిళను కేవలం ఒక భోగ వస్తువుగా, పిల్లలను కనే యంత్రంలా,వంటింటి కుందేలుగా,జీతంలేని కూలీగా,కేవలం నాలుగు గోడల మధ్య నలిగి పోయే మూగ జీవిగా, పురుషాధిక్యతలో నలిగి పోయే ఒక అతి సామాన్య స్త్రీ లింగంగా భావిస్తూ, శాసిస్తూ వచ్చాడు. తర్వాత.. తర్వాత, కాలంతో పాటు అనేక మార్పులు, చట్టాలు, శాసనాలు, అభ్యుదవాద చైతన్య కార్యక్రమాలు స్త్రీ జీవితంలో, జీవనశైలిలో, బ్రతుకు బాటలో అనేక మార్పులు వచ్చాయి. ఆమె జీవితంలో కొంత వరకు స్వేచ్ఛ అనే వెసులుబాటు వచ్చింది. ప్రశ్నించే తత్త్వం అలవాటు అయింది. మగాడితో సమానంగా చదువుకుని, సంపాదించుకునే స్థాయికి ఎదిగింది. అవసరమయితే మగాడిని శాసించే స్థితికి కూడా చేరుకుంది. రాష్ట్రపతిగా  ప్రధాన మంత్రిగా, ప్రధాన న్యాయమూర్తిగా, ముఖ్యమంత్రిగా, ఇలా ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించిన ఘనచరిత్ర మనం ఎరుగుదుం. అపారమైన మేధస్సు, కష్టించి పని చేయాలనే తపన, వృత్తి పరంగా హోదా.. అన్నే వున్నా, శారీరకంగా ఆమె బలహీనురాలు. అందు చేతనే రెండు -------

ఇప్పటికీ ఇంకా కొన్ని సమస్యలకు వనిత బలికాక తప్పడం లేదు. ఇంట్లో బయట, బడిలో- గుడిలో ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ పరంగా మహిళల రక్షణ కోసం ఎన్ని శాసనాలు చేసినా, మనిషి ముఖ్యంగా, మగాడి మనఃస్తత్వం మారనంత వరకూ, పాలకులతో సహకరించనంత వరకూ స్త్రీ రక్షణ విషయంలో ఎలాంటి మార్పు రాదు. సమస్య లేకుండా ఏ మహిళా అనవసరంగా, ఎదుటి వారిపై అభియోగాలు తీసుకురాదు. అందుకే ఆడవాళ్ళ మాటలు నమ్మాల్సి వస్తుంది. కానీ అవి ఒకోసారి వక్ర రూపం దాలుస్తుంటాయి. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అదేంటో ఒకసారి నా అనుభవంలోకి వెళ్లి పరిశీలిద్దాం.

****

పన్నెండు సంవత్సరాలపాటు మహాహబూబాబాద్(ఇప్పుడు జిల్లా అయింది) తాలూకా ఆసుపత్రిలో దంతవైద్యుడిగా పనిచేసి, బదిలీ వేటు పడడంతో, నాటి నర్సంపేట శాసన సభ్యులు స్వర్గీయ ఓంకార్ గారి సహాకారంతో, జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ అయ్యాను. నా భార్య స్టేట్ బ్యాంకు లో హనుమకొండలో పని చేస్తుండడం వల్ల, పిల్లలు కూడా హన్మకొండ లో చదువుకుంటుండడం వల్ల, జనగామలో స్థానికంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటికీ స్థానిక వైద్య మిత్రులు, నాకు సర్వీసు లో సీనియర్ అయిన డా. రాంనర్సయ్య గారి సహకారంతో వారి ఇంట్లో గెస్టుగా కొన్ని రోజులు గడిపి ఆ తర్వాత హనంకొండ నుండి ‘అప్ & డౌన్ ' చేస్తుండే వాడిని. ఉద్యోగ జీవితంలో ఇది నా రెండవ అంకం. ఈ ప్రతి రోజూ ఉద్యోగ నిమిత్తం తిరగడం అన్నది మొదటిసారి అనుభవం. కానీ ఈ అనుభవం పదేళ్ల పాటు గొప్ప మధురానుభూతిని మిగిల్చిన విషయం మరచిపోలేనిది, అయినప్పటికీ-అప్పుడప్పుడూ మిగిల్చిన చేదు అనుభవాలను కూడా అంత త్వరగా మరచి పోలేము. మూడు ----ఉదయం ఖాజీపేట స్టేషన్ నుండి భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు ఉండేది. దాని గమ్య స్థానం సికింద్రాబాద్. మా హాస్పిటల్ సమయానికి సరిగ్గా చేర్చేది ఆ రైలు. అందు చేత వరంగల్/హనంకొండ/ఖాజీపేట, పరిసర ప్రాంత ఉద్యోగులంతా ఆ రైలును ఎంచుకుని ప్రయాణం చేసేవారు. ఇంచు మించు అన్ని శాఖలకు సంభందించిన ఉద్యోగులు ఇందులో ఉండేవారు. వైద్యశాఖకు సంబంధించిన ఉద్యోగులు ఎక్కువమంది ఉండేవారు. అందరం ఒకే చోట సర్దుకుని కూర్చొనేవాళ్ళం. చక్కని చమత్కార సంభాషణలతో, కడుపుబ్బ నవ్వించే హాస్య ఛలోక్తులతో సరదాగా ఉండేది ప్రయాణం. రైలు దిగి, రైలు పట్టాలు దాటి కొంచెం దూరం నడిస్తే, పోస్టాఫీసు. దానికెదురుగా ‘షబ్బీర్ హోటల్ ' ఉండేది. అందరం అందులో స్పెషల్ చాయ్ తాగి ఎవరి డిపార్ట్మెంట్ కు వాళ్ళం వెళ్లిపోయేవాళ్ళం. ఇది ప్రతిరోజూ జరిగే వ్యవహారం!

హాస్పిటల్ లోపలి కి వెళ్లే గేటుకి ఎదురుగా బయట ’బి. ఎన్. మెడికల్ స్టోర్ ఉండేది. ఆ స్టోర్ యజమాని, అందులో పని చేసే రమేష్ అనే ఒక కుర్రాడు నాకు బాగా పరిచయం. నన్ను అమితంగా ఇష్టపడేవారు. ఒక రోజున యధావిధిగా హాస్పిటల్ లోపలికి వెళ్ళబోతే, ఆ.. మెడికల్ షాపు రమేష్ పరుగు పరుగున వచ్చి నాకు అడ్డు నిలబడ్డాడు. పైగా బాగా ఆయాస పడుతూ ‘ సార్.. మీరు లోపలి వెళ్లొద్దు ’ అన్నాడు కంగారు పడుతూ.‘అదేంటి .. ఎందుకు రమేష్ ?’ అన్నాను ఆశ్చర్యంగా. ‘వద్దు సార్.. వెళ్లొద్దు.!’ అన్నాడు విషయం ఏమిటో వివరం చెప్పకుండా !‘విషయం చెప్పు రమేష్ ’ అన్నాను, కాస్త విసుగ్గా.

‘మీ డిపార్ట్ మెంట్ దగ్గర ఒక మహిళ వుంది. బిగ్గరగా ఏడుస్తుంది, మీ..నాలుగు సీటు వంక చూపించి .. ‘ వీడే నన్ను నాశనం చేసాడు, పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడు అంటుంది సార్’ అన్నాడు గుక్క తిప్పుకోకుండ. ఆతను చెప్పింది వినగానే నా గుండె ఒక్కసారిగా ఝల్లుమంది. వళ్ళంతా చెమటతో నిండిపోయింది. అక్కడి నుండి రెండడుగులు వెనక్కి వేసాను. కానీ, యెంత సేపు అలా వుండగలను? పైగా ఆలస్యం అయ్యేకొద్దీ హాస్పటల్ లో జనం పెరిగి సమస్య మరింత ఝటిలం కావచ్చు. ఇదేదో నేను నిజంగానే ఆమెను మోసం చేశానన్న ప్రచారం జరగవచ్చు. అందుచేత డిపార్ట్ మెంట్ కు వెళ్ళడానికే నిశ్చయించు కున్నాను. రమేష్ తో పాటు ఒకరిద్దరు నన్ను అనుసరించారు. మేము డెంటల్ డిపార్ట్ మెంట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ తైల సంస్కారం లేని బక్క చిక్కిన, నడి వయస్సులో వున్న ఒక స్త్రీ మూర్తి, నా కుర్చీ వైపు చూపిస్తూ అవే డైలాగులు వల్లిస్తోంది. నేను దైర్యంగా ఆమె దగ్గరికంటే వెళ్లాను. కానీ, ఆమె నన్ను చూడకుండా, చూసినా ఏమీ  దించకుండా నా డిపార్ట్ మెంట్ వైపు చూస్తూ ఆమెకు తోచిన రీతిలో శాపనార్ధాలు పెడుతోంది. ఇక ఆలస్యం చేసి లాభం లేదనుకుని, విషయం మా హాస్పిటల్ ముఖ్య అధికారి దృష్టికి తీసుకు వెళ్లాను. ఎందుకైనా మంచిదని ఆయన పోలీసులకు ఈ విషయాన్ని అధికారికంగా చేరవేశారు. పది నిముషాల్లో ఒక సబ్-ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లతో పోలీస్ వాన్ మా ఆసుపత్రి ప్రాంగణం లోనికి అడుగు పెట్టింది. ప్రాధమిక అంశాలను విచారణ జరిపిన పోలీసులు, నన్ను జీప్ లోను, ఆ మహిళను వాన్ లోను తీసుకుని పోలీసు స్టేషన్ కు తీసుకు పోయారు. నాకిది భయంకరమైన కొత్త అనుభవం. ఏదో తెలియని దడ, అయినా ముఖంలో ఎలాంటి మార్పులు కనపడకుండా దైర్యంగా కూర్చున్నాను. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక వైద్యుడికి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తూనే అయిదు  ఆ .. మహిళకు ఎదురుగా నాతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సివిల్ డ్రెస్ లో కూర్చో బెట్టారు. అప్పుడు ఒక్కొక్కరినీ చూపించి,’’ ఈయనే కదా నీకు అన్యాయం చేసింది ?’’ అని, సబ్-ఇన్స్పెక్టర్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అలా అందరినీ చూపించి అడగడం మొదలు పెట్టాడు. అందరి విషయం లో ఆమె నుండి ‘కాదు’ అన్న సమాధానమే వచ్చింది. బ్రతుకు జీవుడా .. అనుకున్నాను. స్వేచ్ఛగా గాలి పీల్చుకోవడం మొదలు పెట్టాను. శిరస్సు నుంచి పెద్ద భారం దిగిపోయిన అనుభూతి కలిగింది.

‘డాక్టర్ సాబ్ సారీ, ఇది తప్పదు. సహకరించినందుకు ధన్యవాదాలు.

మీరు ఇక వెళ్ళచ్చు’ అని తిరిగి జీపులో హాస్పిటల్ కి పంపించారు. ఈ దురదృష్టకర సంఘటన ఎప్పుడు గుర్తుకొచ్చినా, గుండె గుభిల్లు మంటుంది నాకు. ఇలాంటి సంఘటనలు పగవాడికి కూడా రాకూడదని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఇలాంటి ఘటనలూ, సంఘటనలూ, ప్రజా సంబంధాలు కలిగిన ఉద్యోగులకు ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా, ఎక్కడైనా,ఎదురు కావచ్చు. అందుకే ఎప్పుడూ ప్రతి చిన్న విషయం లోనూ అప్రమత్తంగా ఉండాలి. కంగారు పడకుండా సంయమనంతో, సమస్యను పరిష్కరించుకోవాలి. స్త్రీ నైనా పురుషుడినైనా, అన్ని సార్లూ నమ్మలేము, ఎప్పటికీ విస్మరించలేము కూడా! మిత్రులారా తస్మాత్ జాగ్రత్త !!

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు