తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర నినాదంతో ఆందోళనలు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో సినిమా షూటింగులు చేయడం ఇబ్బందిగా మారింది తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖలకి. కొన్ని సినిమాలకు ఆటంకాలు కలిగించారు, కొన్ని సినిమాల షూటింగుల సందర్భంగా హడావిడి చేసి, నటీనటులతో జై కొట్టించుకుని వదిలేశారు ప్రత్యేకవాదులు. ఎలాగో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తాలూకు హడావిడి తగ్గిందనుకుంటే, సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ఉధృతమయ్యింది.
మొన్నటికి మొన్న సినీ నటి తమన్నా విశాఖపట్నం వెళితే, అక్కడ ఆమెతో ‘జై సమైక్యాంధ్ర’ నినాదం చేయించడానికి ప్రయత్నించారు సమైక్యవాదులు. ‘జై ఇండియా’ అని తప్పించుకుంది తమన్నా. అది చూసి, తెలుగు సినీ ప్రముఖులుల్లో గుబులు మొదలైంది. ‘జై సమైక్యాంధ్ర’ అని అంటే, తెలంగాణలో ఇబ్బందులు వస్తాయని, సీమాంధ్ర వైపు వెళ్ళడం మానేశారట కొందరు సినీ ప్రముఖులు.
సినిమా షూటింగులు సీమాంధ్రలో చేయాల్సి వుంటే, వాటిని కొన్ని రోజులు వాయిదా వేసుకుంటున్నారట ప్రముఖ నటీనటులు. ఇదెక్కడి తంటా? కళకు ప్రాంతీయ బేధాలు ఆపాదించవచ్చా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నప్పటికీ ఎవరి సెంటిమెంట్లు వారివి, ఎవరు డిమాండ్లు వారివి. అన్నీ కలిసి తెలుగు సినిమాని ఇబ్బందులపాల్జేస్తున్నాయి.
తెలుసు కదా, ఈ ఆందోళనల వలనే ‘ఎవడు’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి.
|