'రుద్రమదేవి' సినిమా సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తున్న గుణశేఖర్, కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాడట. అల్లు అర్జున్తో ఇప్పటికే గుణశేఖర్ తాను చేయబోయే కొత్త సినిమా గురించి చెప్పాడనీ, అల్లు అర్జున్ కూడా గుణశేఖర్ చెప్పిన కథకు ఓకే అన్నాడనీ సమాచారమ్. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటిదాకా రెండు చిత్రాలొచ్చాయి. 'వరుడు' సినిమా పెద్ద ఫ్లాప్ అయినా, గుణశేఖర్తో అల్లు అర్జున్ స్నేహం కొనసాగింది. ఆ స్నేహమే, బన్నీ తనంతట తానుగా 'రుద్రమదేవి' సినిమాలోని గోనగన్నారెడ్డి పాత్ర పోషించేలా చేసింది. 'రుద్రమదేవి' టైమ్లోనే కమర్షియల్ సినిమా గురించి గుణశేఖర్,
అల్లు అర్జున్కి చెప్పడం, అప్పుడే అల్లు అర్జున్, గుణశేఖర్కి ఓకే చెప్పడం జరిగిపోయాయంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కేథరీన్ ట్రెస్సా నటించే అవకాశముందని తెలుస్తుంది. కేథరీన్ ఇప్పటికే అల్లు అర్జున్తో 'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమాలో నటించింది. బోయపాటి డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ కేథరీన్ హీరోయిన్. ముచ్చటగా మూడోసారి అల్లు అర్జున్తో కేథరీన్, గుణశేఖర్ డైరెక్షన్లో నటించనుందని అర్థమవుతోంది. అయితే బన్నీతో సినిమా విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|