రాధ, శ్రీదేవి.. ఒకరితో ఒకర్ని పోల్చలేంగానీ, ఇద్దరూ తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన వారే. శ్రీదేవి రేంజ్ బాలీవుడ్ అయితే, రాధ సౌత్ సినిమాలకే పరిమితమైంది. అయితే తెలుగు తెరపై శ్రీదేవి వేసిన ముద్ర ఎంత గొప్పదో, రాధ వేసిన ముద్ర కూడా అంత కాకపోయినా, తక్కువేమీ కాదు.
వీరిద్దరికీ ఓ విషయంలో పోలిక పెట్టాలి. రాధ పెళ్ళి చేసుకున్నాక సినిమాల వైపు మళ్ళీ కన్నెత్తి చూడలేదు. శ్రీదేవి మాత్రం కొన్నేళ్ళు గ్యాప్ తీసుకుని రీ'ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికీ వన్నె తరగని అందం ఆమెది.. అని చెప్పుకునేలా శ్రీదేవి గ్లామర్ మెయిన్టెయిన్ చేస్తూ వస్తోంది. అయితే, రాధ ఓ అడుగు ముందుకేసి, తన ఇద్దరు కూతుళ్ళనూ వెండితెరకు పరిచయం చేసింది హీరోయిన్లుగా.
శ్రీదేవి మాత్రం, ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉండాలనుకుంటోంది. ఈ క్రమంలో తన కుమార్తెలను హీరోయిన్లుగా పరిచయం చేయాలనే వ్యూహం ముందే రచించుకుంది శ్రీదేవి. రాధను అందరూ మర్చిపోయాక ఆమె కూతుళ్ళు తెరంగేట్రం చేయగా, వారు హీరోయిన్లుగా అంతగా నిలదొక్కుకోలేకపోయారు. ఆ తప్పు శ్రీదేవి చేయకూడదనుకుంటున్నట్టుంది. నటిగా తాను వెలుగుతూనే, ఆ వెలుగులోనూ తన కుమార్తెలనూ స్టార్స్గా మలచాలనుకుంటోంది. ఎంతైనా శ్రీదేవికి సౌత్ నుంచి బాలీవుడ్కి ఎదిగిన తెలివితేటలున్నాయి కదా.
|