ఒకప్పుడు ఆయన సంచలన దర్శకుడు. 'చిత్రం', 'జయం', 'నువ్వునేను' చిత్రాలతో తేజ సృష్టించిన సంచలనమెంతో అందరికీ తెలిసినదే. ఓ టైటిల్ లోగోతోపాటు ఎన్నెన్నో టైటిల్స్ని ఒకేసారి రిజిస్టర్ చేసి పేటెంట్ దక్కించుకున్న దర్శకుడిగా రికార్డులకెక్కాడు తేజ. అతను అడిగితే 'నో' చెప్పే నటుడు ఉండేవాడు కాదు. కానీ కొన్ని కారణాలతో తేజ సినిమా కెరీర్లో పెద్ద బ్రేక్ తీసుకున్నాడు. పునరాగమనంలో మళ్ళీ అలాంటి సంచలనాలకే తెరతీయబోతున్నాడట తేజ. రానా హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్.
తెలుగులో కాజల్కి తొలి దర్శకుడు తేజ. కళ్యాణ్రామ్ హీరోగా తేజ రూపొందించిన 'లక్ష్మీకళ్యాణం' సినిమాతోనే కాజల్ తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. 'నేనే రాజు నేనే మంత్రి' అనే టైటిల్ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కేథరీన్ ట్రెసా కూడా నటిస్తోంది. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని పేర్కొంటూ హీరో రాణా, తేజ - కాజల్తో కలిసి ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో ఉంచాడు. సినిమా విశేషాలు ముందు ముందు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ అంటోంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది.
|