మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే బోలెడంత మంది హీరోలు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాతి జనరేషన్ అయిన చరణ్, అల్లు అర్జున్ ఆల్రెడీ స్టార్డమ్ దక్కించుకోగా, ఆ తర్వాత వచ్చిన సాయి ధరమ్, వరుణ్తేజ్లు తమదైన శైలిలో హీరోలుగా కొనసాగుతున్నారు. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్దేవ్ కూడా 'విజేత'తో హీరోగా ఓకే అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే, వెరీ లేటెస్టుగా మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వైష్ణవ్ తేజ్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. మెగా మేనల్లుడు 2గా వైష్ణవ్ తేజ్ని అభివర్ణిస్తున్నారు. అవును మెగా మేనల్లుడు సాయి ధరమ్తేజ్కి స్వయానా తమ్ముడే ఈ వైష్ణవ్ తేజ్. మైత్రీ మూవీస్ బ్యానర్తో కలిసి సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
సుకుమార్కి శిష్యుడైన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మెగా హీరోలందరి సమక్షంలో ఈ సినిమాని తాజాగా హైద్రాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వైష్ణవ్ తేజ్ ఫస్ట్లుక్కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. భుజాన చేపల వలను ఎత్తుకుని లుంగీలో వెనక్కి తిరిగి రగ్గ్డ్ లుక్లో కనిపిస్తున్న వైష్ణవ్ తేజ్ లుక్ రంగస్థలంలోని చరణ్ లుక్ని తలపిస్తోంది. కథ కూడా అదే తరహాలో ఉండబోతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా తొలి సినిమాతోనే ఏదో పెద్ద మ్యాజిక్ చేసేలానే ఉన్నాడీ మెగా మేనల్లుడు 2. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
|