హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గం నుండి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు నందమూరి బాలకృష్ణ. ఇది టీడీపీ శ్రేణులు కూడా ఊహించని విజయం. నియోజక వర్గంలో బాలయ్యపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ వెంట జనం చాలా పలచగా కనిపించారు. కానీ ఇంతటి వ్యతిరేకతను బాలకృష్ణ తట్టుకుని నిలబడ్డారు. రెండోసారి అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే, బాలయ్య మీద ఇప్పుడు బాధ్యత చాలా ఎక్కువైంది. కేవలం బాలకృష్ణ ఎమ్మెల్యే మాత్రమే కాదు, తెలుగు దేశం పార్టీకి ఉన్న అతి కొద్ది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. ఓ వైపు అల్లుడు లోకేష్ ఓడిపోయారు. ఇంకోవైపు బావ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు. ఇలాంటి తరుణంలో బావ చంద్రబాబుకు బాలయ్య బలంగా మారాలి తప్ప. బలహీనత కాకూడదు. ఇదిలా ఉంటే, మళ్లీ బాలయ్య సినిమాల్లో బిజీ అవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారేమో అనే ప్రచారం జరుగుతోంది.
ఓ సినీ నటుడి కంటే, తెలుగుదేశం పార్టీ రథ సారధిగా బాలయ్యను చూడాలనుకుంటున్నారు నందమూరి అభిమానులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం అంటే, ఆషామాషీ విషయం కాదు. ఇప్పుడు బాలయ్య చేయాల్సింది ఓ మహాయజ్ఞమే. చేస్తాడా.? మరి చూడాలిక.
|