అడవి బాపిరాజు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

అడవి బాపిరాజు.

అడివి బాపిరాజు (అక్టోబరు 8, 1895 - సెప్టెంబరు 22, 1952). బహుముఖ ప్రజ్ఞాశీలి,స్వాతంత్ర్యసమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవాడు. 1922 లో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అరెస్టయినాడు. జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించాడు. బందరు జాతీయ కళాశాలలో ప్రమోద్ కుమార్ ఛటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించాడు. తిక్కన, సముద్ర గుప్తుడు లాంటి చిత్రాలు గీశాడు. భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశాడు. ఈ నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశాడు. అదే సమయంలో కథలు రాశాడు. 1939 లో సినీరంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశాడు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాదునుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించాడు. 1952 సెప్టెంబరు 22 న మద్రాసులో కన్నుమూశారు.
తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.
కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పనిచేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో సముద్ర గుప్తుడు, తిక్కన ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
1922లో సహాయ నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను తొలకరి అనే నవలలో పొందుపరచారు.
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన శబ్ద బ్రహ్మ అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు మ్యూజియంలో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసు ప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.