సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు...? - .

sirivennela is no more

ద్వంద అర్దాలతో , పిచ్చి కేకలతో సతమతమవుతున్న తెలుగు పాటలకు రూపం దిద్ది సిరివెన్నెల చిత్రం ద్వారా పరిచయమైన సీతారామశాస్త్రి గారు ఇక లేరు అని తెలియజేయడానికి దుఃఖిస్తున్నాము. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. సీతారామశాస్త్రి మృతితో చిత్ర పరిశ్రమలో విషాధ చాయలు అలముకున్నాయి. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున’ గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సుమధుర గీతాలెన్నింటినో రాశారు. దాదాపు 800లకు చిత్రాల్లో 3వేలకు పైగా పాటలు రాసారు.

గాయం మూవీలో 'నిగ్గు దీసి అడుగు' అంటూ సిగ్గులేని జనాన్ని కడిగేసిన పదునైన కలం ఆయనది. అందరిలో ఉన్నా... ఒంటరిగా బతుకుతున్న ఓ యువకుడి కథ కోసం ‘జగమంతా కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ జనాన్ని కన్నీళ్లు పెట్టించిన కలమూ ఆయనదే. అంకురం చిత్రం లోని "ఒవరో ఒకరు ... ఎపుడో అపుడు" లాంటి ఎన్నో స్ఫూర్తిదాయక గేయాలు ఆయన కలం నుండి వెలువడ్డాయి. ఇటీవల విడుదలైన అలవైకుంఠపురంలో 'సామజవరగమన' పాట ఒక  పెద్ద సంచలనం.

చెంబోలు సీతారామశాస్త్రి 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలో డాక్టర్‌.సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. దిగువ మధ్య తరగతి కుటుంబం. పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్మీడియట్‌, ఆంధ్ర విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు. అప్పట్లో పీజీ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేకపోవడంతో ఎంబీబీఎస్‌ చేయమని ఆయన తండ్రి సలహా ఇచ్చారు. కానీ, ఆ క్రమశిక్షణ తనకు అలవాటు లేకపోవడంతో అంతగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావటంతో రాజమహేంద్రవరంలో కొన్నాళ్లు పనిచేశారు.