మహాభావాలు కవితా సంకలనం - రాము కోలా.దెందుకూరు

మహాభావాలు కవితా సంకలనం

మహాభావాలు "అనే కవితా సంకలనం గురించి నా చిరుస్పందన. హరివిల్లు అనే ప్రక్రియలో "ఔరా! అనిపించే కవితల మణిహారమే " "మహాభావాలు"కవితా సంకలనం. "అగాధమౌ జలనిధి లోనా ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ...... ....... ఏదీ తనంత తానై.. నీ దరికి రాదు శోధించి సాధించాలి.. అదియే ధీరగుణం." అనే శ్రీశ్రీ గారి పాటను తనకు అన్వయించుకున్నారు ఏమో! దుర్గా మహాలక్ష్మి ఓలేటి గారు. కవయిత్రి ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ, గృహిణిగా బాధ్యతను నిర్వహిస్తూ,సాహిత్య రంగంలో తన ఉనికిని చాటుకోవడం హర్షించదగ్గ విషయమే. భాష పట్ల ఉన్న మక్కువతో, తెలుగు భాషపైన పట్టు కలిగి ఉండడంతో, ఛందస్సుకు అనుగుణంగా, కవిత్వం అందించడంలో వీరు నూరు శాతం సఫలీకృతులైనారు అనడంలో! ఎటువంటి సందేహమూ లేదు. "మహా భావాలు.." సార్థక నామధేయం, అనేలా సాగిన కవిత్వం , శుభకృతు నామ ఉగాది పర్వదిన శుభ మూహూర్తమున ,పుస్తకావిష్కరణ జరుపుకుని,పాఠక దేవుళ్ళు ముంగిట నిలిచిన సంకలనం చదివి మనసారా ఆశిర్వదించే ముందు ,వారి గురించి నాలుగు మాటలు ముచ్చటించుకుందాం. మస్తిష్కంను మదించి, అక్షరాలను క్రోడీకరించి, అద్భుతమైన భావాలకు, తేనెలొలుకు తెలుగు భాషా మాధుర్యాన్ని జతచేసి , "హరివిల్లు" అనే ప్రక్రియలో లిఖించిన కవిత్వంను, . సాహితీ ప్రియులకు పరిచయం చేసే తన తొలి ప్రయత్నమే, "మహాభావాలు "అనే ఈ లఘు రూప కవితా సంకలనం.. అనంతమైన భావాన్ని కొన్ని వాక్యాల్లో పొందుపరిచి,ఎదుటివారిని , ఔరా!అనిపించేలా వ్రాసిన కవయిత్రి, సమాజాన్ని అర్థం చేసుకుంటూ, సమాజంలో మార్పును స్వాగతిస్తూ, తన బాధ్యతను రచనల ద్వారా చాటుకునే విధానం, ఈ సంకలనంలో ఆకట్టుకుంటుంది.. తెలుగు సాహిత్య ప్రపంచం లోనికి అడుగుపెట్టి, కవులను,కవయిత్రులను,రసహృదయులైన పాఠకుల్ని అలరించి, ఆకట్టుకునేలా రచనలు చేయడం, అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అనే విషయం గుర్తెరిగి, అనితర సాధ్యమైన శైలిలో , వ్యావహారిక భాషలోని పదాల మృదుత్వంతో, వాస్తవికతకు పెద్ద పీట వేస్తూనే.. మానవీయతకు పట్టంకట్టారు కవయిత్రి. పదాల నిర్మాణ శైలి, ఆకర్షణగా నిలిపే ప్రయత్నంలో ఎంతగా తపించారో,ఒక్కో కవిత చదువుతూ వెళుతుంటే అర్థమౌతుంది. మన ఆలోచనలే మన ప్రవర్తన మన భావాలే మనం పలికే మాటలు. కావాలి,అని చెప్పగల పరిపూర్ణత కలిగి ...... ....... కవిత్వం అది ఒక మానసికోల్లాస కోలాహలం... అంతులేని అనుభవాల సమ్మేళనం నవరస భావోద్వేగాల సంవేదం... సామాజిక స్థితిగతుల దర్పణం... నైతిక విలువల మార్గదర్శనం.... అందమైన అక్షర పూబాలల బృందావనం.... ఇలా తన భావాలను అద్భుతంగా కవిత్వీకరించగల బహునేర్పరి దుర్గా మహాలక్ష్మి ఓలేటి గారు. ఆత్మ విశ్వాసానికి అంతమే లేదు మనో నిబ్బరానికి మరణమే లేదు. నాలుగు వాక్యాల్లో "మనిషికి తోడుగా ఉండవలసినవి ఇవే "అని వివరించగల నేర్పు వీరికి మాత్రమే సొంతం అనిపిస్తుంది. ...... అక్షరం ఆత్మ బంధువై అక్కున చేర్చుకుంది అక్షరమే ఆయుధమై నన్ను గెలిపించింది. ...... తనకు గుర్తింపును కల్పించిన అక్షరం పట్ల , దుర్గా మహాలక్ష్మి ఓలేటి గారు .. వినయంతో కృతజ్ఞతలు తెలుపుకున్న విధానం. ఎంత ఎదిగినా! ఒదిగి ఉండాలి అనే మాటను"ఆచరణలో చూపించారు అనిపిస్తుంది. "కలం చేతపట్టి చూడు, కొత్త చరిత్రను వ్రాయగలవు. నీ ఆలోచనలకు పదును పెట్టిచూడు, నీవే చరిత్రలో నిలిచి పోగలవు". అనే మాటలకు నూరు శాతం న్యాయం జరిగితేనే,తను వ్రాసిన భావాలకు విలువ,గౌరవం, గుర్తింపు,అని భావించే "దుర్గా మహాలక్ష్మి ఓలేటి" గారి కలం నుండి జాలువారిన "మహాభావాలు" తెలుగు సాహిత్యంలో మరో ఆణిముత్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పుటలు నిండిపోతుంటాయి. దుర్గా మహాలక్ష్మీ ఓలేటి గారు చెప్పినట్లు ,అక్షర పూబాలల బృందావనం లోనికి స్వాగతం పలుకుతున్నా. తన "మహాభావాలను "చేతిలోనికి తీసుకుని చదివి చూడండి. ఇక ఆలస్యం ఎందులకు... మీదే ఆలస్యం.. ఈ సమయంలో ఎక్కడో చదివిన నాలుగు వాక్యాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. "నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాలు పండించే భావాలు" అని ఎవ్వరో మహానుభావులు చెప్పిన మాటలు పదేపదే గుర్తుకు వస్తున్నాయి. ఈ సంకలనం లోని ప్రతి కవిత చదువుతూ సాగిపోతుంటే. దేవరకొండ బాలగంగాధర తిలక్‌. కవిత్వం గురించి అన్నమాటలు గుర్తుకు వస్తున్నాయ్.. ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు... నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు.... నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అనగలిగాడు. కవిత్వంలోని మాధుర్యం అదేనేమో.! తనకంటూ ఒక రచనా. శైలి ఏర్పరచుకున్న, మా చెల్లాయి మరెన్నో సంకలనాలను వెలుగులోనికి తీసుకు రావాలని మనసారా కోరుకుంటూ.. ఆదరించండి..అభినందించండి.

రాము కోలా.ఖమ్మం✍️ చరవాణి.9849001201.