పంచతంత్రం - నల్లు - ఈగ - రవిశంకర్ అవధానం

Panchatantram - nallu - eega

పంచతంత్ర కథలు కేవలం పిల్లలకు నీతులు నేర్పడానికే కాదు, జీవితంలో ఎంతో అనుభవం సంపాదించిన పెద్దలకు కూడా ఎన్నో విషయాలు నేర్పుతాయి. దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాసిన ఈ కథలు ఇప్పటికీ ఎంతో ఆచరణాత్మకంగా ఉన్నాయి. ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా తొందరపాటు ఎంత ప్రమాదకరమో, నిదానం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం.

ఒక రాజు పడక గదిలో, పట్టు పరుపుల మధ్యన ఒక నల్లు ఉండేది. అది రాజు బాగా నిద్రపోయిన తరువాత, నెమ్మదిగా పాకి వచ్చి, రాజు రక్తాన్ని తాగేది. రాజుకు ఈ విషయం తెలియకపోయేది. అది తన జీవితంతో ఎంతో సంతృప్తిగా ఉండేది. ఒకరోజు, ఆ గదిలోకి ఒక ఈగ వచ్చింది. అది కూడా రాజు రక్తాన్ని తాగాలనుకుంది. నల్లు ఆ ఈగను చూసి, "నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇది నా స్థలం" అని చెప్పింది.

ఈగ, "నేను ఒకే ఒక్కసారి రక్తం తాగి వెళ్లిపోతాను" అని చెప్పింది. నల్లు, "నువ్వు చాలా తొందరగా కాటేస్తావు. రాజు మేలుకుంటే ప్రమాదం. రాజు బాగా నిద్రపోయిన తరువాతే నేను రక్తం తాగుతాను. నువ్వు కూడా అలాగే ఉండాలి" అని ఈగకు సూచించింది.

రాజు పడక గదిలోకి వచ్చి పడుకున్నాడు. ఈగకు మాత్రం ఆగడం కుదరలేదు. రాజు ఇంకా నిద్రపోక ముందే, అది తొందరపడి కాటు వేసింది. రాజుకు ఒక్కసారిగా మంట అనిపించింది. కోపంతో " ఎవరో కాటు వేశారు! వెతకండి!" అని సేవకులకు చెప్పాడు.

నల్లు వెంటనే పరుపుల మూలల్లో దాక్కుంది. సేవకులు వెతకడం ప్రారంభించారు. వారు ఈగను చూసి, దానిని చంపేశారు. నల్లు మాత్రం దాక్కుని తన ప్రాణాలు కాపాడుకుంది. ఈగ తొందరపాటు దాని ప్రాణాల మీదకు తెచ్చింది.

నీతిశాస్త్రం
ఈ కథలోని నీతి ఏమిటంటే - తొందరపాటు పనికి రాదు. నిదానం, ఓర్పు ఎప్పుడూ మేలు. తెలియని వారి మాటలు గుడ్డిగా నమ్మకూడదు.

కార్పొరేట్ ప్రపంచంలో ఈ నీతి ఎంత ముఖ్యం?

  • తొందరపాటు నిర్ణయాలు: ఆఫీసులో ఏదైనా పనిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, పరిశీలన చేయకుండా ముందుకు వెళ్ళడం. ఇది పొరపాట్లకు దారి తీస్తుంది.
  • క్రెడిట్ కోసం తొందరపడటం: ఒక ప్రాజెక్టు పూర్తి కాకముందే, క్రెడిట్ తీసుకోవాలని తొందరపడటం. ఇది ఈగలాగే సమస్యలను సృష్టిస్తుంది.
  • కొత్త వ్యక్తుల పట్ల అజాగ్రత్త: ఆఫీసులో కొత్తగా వచ్చిన వారిని పూర్తిగా తెలుసుకోకుండా, వారి మాటలు విని తొందరపడటం. ఇది ప్రమాదకరం.
  • వ్యవస్థను అర్థం చేసుకోవడం: ఒక వ్యవస్థలో ఎలా ఉండాలో తెలుసుకుని, నిదానంగా వ్యవహరించడం ముఖ్యం. నల్లు రాజుగారి పడక గదిలో జీవించడం ఎలాగో నేర్చుకుంది.


వ్యక్తిగత జీవితంలో ఒక ఉదాహరణ:
ఎవరైనా పెట్టుబడి గురించి చెప్పినప్పుడు, పూర్తిగా విచారణ చేయకుండా తొందరపడి డబ్బు పెట్టడం. ఇది నష్టానికి దారి తీస్తుంది. తొందరపడి కోపం తెచ్చుకుని మాట్లాడటం వల్ల సంబంధాలు చెడిపోతాయి.

ఆ రోజు ఆ ఈగ తొందరపడకుండా ఉంటే, నల్లుతో కలిసి రాజు రక్తాన్ని తాగేది. కానీ తొందరపాటు దాని ప్రాణాలు తీసింది. ఈరోజుల్లో ఆఫీసులో కూడా చాలామంది 'ఈగ' లాగే ఉంటారు. చిన్న అవకాశం దొరికినా, తొందరపడి ముందుకు వెళ్ళాలని చూస్తారు. కానీ నిదానంగా, తెలివిగా వ్యవహరించే వాళ్ళు 'నల్లు' లాగే సురక్షితంగా ఉంటారు. కాబట్టి, ఆఫీసులో తొందరపడొద్దు, నిదానంగా ఆలోచించండి. లేకపోతే 'ఈగ' లాగే ప్రాణం మీదకు... సారీ, ఉద్యోగం మీదకు వస్తుందేమో !

మరిన్ని వ్యాసాలు

Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్