మొధెరా సూర్య దేవాలయం.
గుజరాత్ లో మహాసానా జిల్లాలో కల మొధెరా ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెకు కొద్ది దూరంలో పుష్పవతి నది ప్రవహిస్తుంది. ఇది ఉత్తర గుజరాత్లో గల సరస్వతీ నదిలో కలిసి పడమరగా నున్న రణ్ ఆఫ్ కచ్ లోనికి పోయి కలుస్తుంది. ఇది మొహసానాకు 18 మైళ్ళ పడమరగా ఉంది. పాటన్ శివారుకు చెందినది. పాటన్ అసలు పేరు అంహిలవడి పాటన్. ఇది సోలంకి రాజుల ముఖ్య పట్టణం. వారి కాలంలో బంగారం, ముత్యాలు, రత్నాలు మొదలగునవి రోడ్డుమీద గుట్టలుగా పోసి అమ్మెడివారట. ఈ పట్టణానికి 8 మైళ్ళ దక్షిణంగా ఒక మహారణ్యం ఉండేదట. దాని పేరు ధర్మారణ్యం. సోలంకిరాజుల కాలములో పాటన్ లో రాజాదరణలో వున్న కొద్దిమంది బ్రాహ్మణులకు, ధర్మారణ్యంలో కొంతభాగం బాగు చేయించి వసతులు కల్పించి దాన మిచ్చారట. పాటన్ నుంచి వచ్చిన బ్రాహ్మణులు మొధ్ లేదా యొఢ్ బ్రాహ్మణులట. వారికి ఇక్కడ వసతులు కల్పించబడినవి కావున దీనికి యొఢెరా లేదా మొధెరా అనే పేరు వచ్చింది.
పుష్పవతి ప్రక్కనున్న సూర్యదేవాలయం సోలంకి రాజైన రెండవ భీందేవ్ సా.శ. 11 వశతాబ్దములో కట్టబడింది. ఇది చోళరాజుల కాలం నాటిది. ఎక్కడచూచిన కనుచూపమేరలో కొండగానీ, రాయిగానీ లేనిచోట కొన్ని మైళ్ళ నుంచి రాయిని తొలచి నదకి 10 అడుగులకు పైగా ఇటుకలతో గట్టిపునాదులు వేయించి రాయిని దూలములు స్తంభములు మూర్తులుగా చిత్రించి అనేక్రకములుగా తయారుజేసి, ఎక్కడా సున్నంతో టాకీ వెయ్యకుండా రాయిలోరాయి అమర్చి ఒక అద్భుతమైన రాతిదేవాలయము ఇక్కడ కట్టారు.
రాతిమీద చెక్కబడ్డ జంతువులూ, నరులూ, వానరులు, దేవగణం, నవగ్రహములు, దిక్పాలకులు అన్నియు స్తపతులయొక్క కల్పన, ఆలోచనాశక్తి చిత్రించటంలో విశిష్టత, ఆధ్యాత్మిక లౌకికజ్ఞానం ఆనాటి సంప్రదాయములు తెలుస్తూ ఉన్నాయి. రామాయణము మహాభారతములలోని కథలు గాథలు మానవజాతికి అనుభవంలో నున్న అనేకకథలు, పుట్టుకలు, చావులు, మైధునములు, రాజూల కొలువుకూటములు ఇలా అనేక విశేషాలు దేవాలయం గోడలమీద చెక్కబడ్డాయి. ఇక్కడ ఆలయము స్థితి మూడు విధములుగా కనిపిస్తుంది 1) గర్భాలయంతో కూడిన గూఢమంటపం 2) సభా లేక రంగమడటం ఇది ప్రత్యెకముగా పది ఆడుగుల దూరంలో విడిగా నిర్మించబడింది. 3) సూర్యకుండ్. ఇది స్నానములకు వినియోగించబడ్డ ఒక కొలను. ఈమూడు కట్టడములూ ఒకే వరుసలో తూర్పు పడమరలుగా ఏర్పరచబడ్డాయి.
గూఢమండపం
ఈ మండపం ప్రవేశ ద్వారమునకు ముందు ఒక మకరతోరణం చక్కగా చెక్కబడిన రెండు స్తంభముల మీద నిలబెట్టియున్నది. ఇవి దేవాలయ నిర్మాణమపుడు రాతిబండల కప్పుతో ప్రవేశద్వారమున కతుబడి ఒక పందిరివలె (porch) అమర్చబడినదని ఊహింపవచ్చును. ద్వారమునుండి లోపలకు ప్రవేశింపగానే గర్భాలయమునకు ప్రాంగణ స్తంభములమీద నిర్మాణము చేయబడింది. ప్రాంగణ మద్యములోని స్తంభములపైభాగము గుండ్రముగా నుండి బోర్లించన పద్మాకృతికల నితానమును (Ceiling) భరిస్తున్నట్లుగాఉన్నది.ఇది ఇప్పుడు పడిపోయింది. స్తంభములను కలుపు రాతి దూలముల మీద దేవగణములు, గణపతి, ముందుకు సాగిపోతున్న సేనలు చిత్రించబడి యున్నవి.ముఖ ద్వారముమీదనున్న గోడకు లోపలి పైకప్పును కలుపు రాతిదూలము మీద మిధునములు, మేళతాళములతో తీర్ధమునకు వెడుతూవున్న ప్రజలముందుకు సాగిపోతున్నట్తు చిత్రించబడి కనిపించుచున్నవి. బయటకివచ్చి గూఢమండపం చుట్టూ పరిశీలించి చూస్తే దేవాలయం పునాదులకట్టడం ఆరు రకాలుగా కనిపిస్తుంది. 1. అధిష్టానం 2. కుముద 3. చజ్జ 4.సింహపట్టిక 5.గణధర 6. నరధర. దేవాలయం చుట్టూనూ క్రిందిభాగంలో అనేకరకములైన మనుష్యులతోనూ భారత భాగవతాది గాథలతోనూ చిత్రించబడి యున్నది.
రంగమండపం
ఇది రాతి స్తంభములతో గుండ్రముగా కనిపిస్తుంది. నాలుగు వైపుల నుంచి మండపం వేదిక మీదకి వెళ్ళుటకు సోపానపంక్తి (balustrade) ఉంది. తూరుపువైపునున్న సోపానం క్రిందనున్న ఒక తోరణమునే కలపబడియున్నది. ఈ మండపములోని జగతి కూడా బయట గూఢమండపము 'జగతినీ బోలియున్నది. దీనిపైన కక్షాసన నున్నది. ఇది నాలుగు వైపులా ప్రేక్షకులు కూర్చొని చూచుటకు వీలుగా వీపూఅంచుటకు కక్ష్యయున్నది. స్తంభములు ఎక్కడా సందు లేకుండా శిల్పముతో చెక్కబడి యున్నవి. దీనిలో మేళవాద్యములు ముందుకు సాగిపోతున్నట్లుగాను, మనుష్యులు, ఏనుగులు, కోతులు అనేక రకములైన పోట్లాటులు కుస్తీలు మొదలగు దృశ్యములతో చెక్కబడి యున్నవి.
సూర్యకుండ్
ఇది రమణీయముగానుండు మెట్లవరుసలుగల ఒక పెద్దకొలను దీనికి నాలుగు మూలలా పంచాండక శిఖరములుగల దేవాలయము నమూనాలు ఉన్నాయి. వీనిలో శీతలాదేవి అనంతశాయి విష్ణువు మొదలగు విగ్రహములున్నవి. ఇవికాక నాలుగువైపులా అక్కడక్కడా చిన్నచిన్న దేవాలయములున్నవి. వీనిలోని విగ్రహము లేమియు చెప్పుటకు వీలులేకుండా నున్నవి. దీనికి రామకుండ్ అని పేరుకూడ ఉంది.
సేకరణ.

