కాశీ ప్రయాణ కథలు - ఔదార్యం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

kashi-prayana-kathalu-audaryam

కాశీ ప్రయాణ కథలు. 2 .

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరంకొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకుతిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

'' అన్నా బ్రహ్మయ్య,తమ్ముడు శివయ్య ఈరోజు మీకు ఔదార్యం అనే కథ చెపుతాను వినండి అని శ్రీహరి కథ చెప్పడం ప్రారంభించాడు..

మారువేషంలో ఉన్న అవంతి రాజుగారు,మంత్రి, ఓ యాచకుని పరిక్షింపదలచి అతనికి కొంత ధనం ఇచ్చాడు. ఆధనం అందుకున్న యాచకుడు నమస్కరించి వేగంగా నడుస్తూ వెళ్ళసాగాడు. అతన్ని రాజుగారు మంత్రి అనుసరించ సాగారు.

అలావెళ్ళిన యాచకుడు నగర పొలిమేరలలో జరుగుతున్న సంతలోనికి వెళ్ళి అక్కడ పంజరాలలో బంధీంచబడి ఉన్న పక్షులను అన్నింటిని బేరం ఆడసాగాడు. అతను ఆపక్షులతో ఏంచేయబోతున్నాడో అర్ధంకాని రాజుగారు అతనికి చేరువగా ఉన్న చెట్టు వెనుకనుండి గమనించసాగారు. ముందుగా ఆ యాచకుడు కుందేళ్ళను కోనుగోలు చేసి వాటిని అక్కడఉన్న పొదలలోవాటిని వదిలివేసాడు. కుందేళ్ళకు స్వేఛ్ఛ కలిగించిన యాచకుడు మరల పక్షులు అమ్మే అతని వద్దకు వచ్చి ధనం చెల్లించచి అతని వద్ద ఉన్న పక్షులను అన్నింటిని పంజరాల నుండి విడుదలచేసి గాల్లో ఎగురవేసాడు.

యాచకుడై ఉండి సంపాదించిన ధనం పరోపకారానికి వినియోగిస్తున్న అతన్ని మెచ్చిన రాజు "తాతా సాటి ప్రాణులుకూడా స్వేఛ్ఛగా బ్రతకాలి అనే నీ ఆశయం మెచ్చదగినది నిన్ను అభినందిస్తున్నా " అన్నాడు రాజు.

" బాటసారి లోకానికి వినియోగపడని ధనం ,విద్యా వృధా. మనదగ్గర ఉన్న ధనంతో సమజాహితమైన పనులుచేయాలి లేదా పది మంది బ్రతుకు తెరువు కలిగేలాచేయాలి. అంతేకాని ఆధనం ఇంట్లో దాచుకుంటే ప్రయోజనం ఏముంటుంది? విద్యాకూడా అంతేకదా మనం నేర్చిన విద్యా,కళ ఏదైనా ఎదటివారికి వినియోగపడకపోతే వృధానే కదా "అన్నాడు యాచకుడు.

రాజు యాచకుని జీవితాంతం సుఖంగా గడిచేలా ఏర్పాటు చేస్తూ, వన్యప్రాణుల వేట తన రాజ్యంలో నిషేదించాడు 'అన్నాడు శ్రీహరి.

అంతా నిద్రకు ఉపక్రమించారు .

మరిన్ని వ్యాసాలు