కుర్రాళ్లూ.. ఐపీఎల్‌ వస్తోంది జాగ్రత్త.! - ..

IPL is coming

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటే కుర్రాళ్లలో కనిపించే జోష్‌ అంతా ఇంతా కాదు, చదువులు పక్కన పెట్టి, షికార్లు కాదనుకుని టీవీలకు అతుక్కుపోతుంటుంది కుర్రకారు. కుర్రోళ్లు కదా. వాళ్ల సరదాలు ఎలా కాదనగలం. వాళ్ల ఆనందాన్ని ఎలా తప్పు పట్టగలం. ఆల్రెడీ ఐపీఎల్‌ కోసం తమ ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు. ఐపీఎల్‌ని ప్రత్యేకంగా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సో కుర్రాళ్ల ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటేమీ లేదన్న మాట. అయితే ఇక్కడే ఓ పెద్ద చిక్కుంది. ఐపీఎల్‌ అంటే ఎంటర్‌టైనింగ్‌ క్రికెట్‌ హంగామా మాత్రమే కాదనీ, అదొక వదిలించుకోలేని జాడ్యమనీ చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. వాటిలో ప్రధమమైనది బెట్టింగ్‌ మహమ్మారి. 
పదో తరగతి కుర్రోడి నుండి అరవయ్యేళ్ల ముసలోడి వరకూ బెట్టింగ్‌ బాధితుడే. ప్రధానంగా 15 నుండి 35 ఏళ్ల వయసు మధ్యనున్నవారు ఈ బెట్టింగ్‌ మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు. అప్పులు పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంకా దారుణమైన విషయమేంటంటే ఏడో తరగతి కుర్రాడొకడు ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఐపీఎల్‌ మీద బెట్టింగ్‌లు కట్టి వేలల్లో డబ్బు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడో జరిగింది కాదు.. మన తెలుగు రాష్ట్రాల్లోనే. అదీ ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగింది. అదీ మామూలు గ్రామానికి చెందిన కుర్రాడతను. ఇంత చిన్న వయసులో అంత రిస్క్‌ చేయడానికి కారణం ఐపీఎల్‌ ఇచ్చే కిక్కు.

ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే అనుకుంటే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో ఎవరికీ ఎలాంటి సమస్యా లేదు. కానీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ని కొందరు జూదంగా మార్చేశారు. నిర్వాహకులపైనే జూదం ఆరోపణలు వచ్చాయి గతంలో. కొంతమంది క్రికెటర్లు బెట్టింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్‌కి దూరమయ్యారు. తద్వారా ఐపీఎల్‌ అప్పట్లో కొంత మసకబారిన మాట వాస్తవం. తర్వాత మళ్లీ మామూలే. ఐపీఎల్‌ 12వ సీజన్‌ వస్తోంది కాబట్టి పిల్లలూ, పెద్దలూ అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో తల్లితండ్రులు ఇంకొంచెం ఎక్కువ అప్రమత్తంగా వ్యవహరించకపోతే అంతే సంగతులు. యువతను ఉర్రూతలూగించే క్రికెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ యువత జీవితాన్ని నాశనం చేసేస్తుండడం అత్యంత బాధాకరం. 'ఐపీఎల్‌ జస్ట్‌ అంటే జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే..' అనుకోవడం ద్వారా మాత్రమే బెట్టింగులకు దూరంగా ఉండగలం.